అమూల్ వర్సెస్ ట్విటర్: చైనాపై పోస్టు.. ఖాతాను డీయాక్టివేట్ చేసిన ట్విటర్..ఏం జరిగిందంటే..?
న్యూఢిల్లీ: భారత్ - చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వివాదంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ డెయిరీ సంస్థ అమూల్ చైనాను ఉటంకిస్తూ తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. అయితే పోస్టుపై ట్విటర్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అడ్డుకుంది. అంతేకాదు అమూల్ ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసింది. అనంతరం కొన్ని గంటల తర్వాత తిరిగి ఖాతాను యాక్టివేట్ చేసింది. దీనిపై ట్విటర్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అమూల్ ట్విటర్ అకౌంట్ బ్లాక్
ఎగ్జిట్ ది డ్రాగన్ అంటూ ఓ కార్టూన్ను అమూల్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. భారత భూభాగంలోకి చైనా మిలటరీ ప్రవేశిస్తుండటంతో డ్రాగన్ కంట్రీకి వ్యతిరేకంగా పోస్టు పెట్టింది. అదికూడా భారత్ చైనా దేశాల మధ్య చర్చలు జరుగుతున్న క్రమంలో ఈ పోస్టింగులు పెట్టిందని చెబుతూ అమూల్ ఖాతాను బ్లాక్ చేసింది.ఆ కార్టూన్లో అమూల్ డెయిరీ సంస్థ ట్రేడ్ మార్క్ అమ్మాయి కార్టూన్ డ్రాగన్ను ప్రతిఘటిస్తున్నట్లుగా ఉంది. ఆ డ్రాగన్ బొమ్మ వెనకాలే చైనా కంపెనీ టిక్ టాక్ కూడా ఉంది. అమూల్ సంస్థ దేశీయంగా అంతర్జాతీయంగా తనదైన ముద్రను వేసుకుంది. ప్రధాని మోడీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్కు స్పందిస్తూ విదేశీ వస్తువులకు స్వస్తి పలకాలంటూ పిలుపునిచ్చింది.
ట్విటర్ యాజమాన్యంపై ఫైర్ అయిన అమూల్ ఫ్యాన్స్
జూన్ 5వ తేదీన తాము చేసిన పోస్టును బ్లాక్ చేయడమే కాకుండా అమూల్ ఖాతానే ట్విటర్ సంస్థ బ్లాక్ చేసిందని యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. అమూల్ను అభిమానించే వారంతా ట్విటర్పై ఆగ్రహం వ్యక్తం చేశారని వెల్లడించారు. ట్విటర్ ఇలాంటి పనులకు పూనుకోవడం సరికాదని యాజమాన్యం తెలిపింది. అంతేకాదు తమ అకౌంట్ను ఎందుకు బ్లాక్ చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని అమూల్ ట్విటర్ యాజమాన్యాన్ని కోరింది. అమూల్ కార్టూన్లు 1966లో ప్రారంభమైందని గుర్తు చేసింది యాజమాన్యం. ఇక అప్పటి నుంచి దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి కార్యక్రమాలు లేదా ఈవెంట్స్ జరిగినా ప్రజలపై ప్రభావం చూపే అలాంటి కార్యక్రమాలు అమూల్ గర్ల్ కార్టూన్ ద్వారా చెబుతున్నామని యాజమాన్యం వెల్లడించింది.
Recommended Video
ట్విటర్ వివరణ ఏంటి..?
అంతేకాదు వివిధ దేశాల ఎన్నికలపై దేశ ప్రధాని, అధ్యక్షులపై, బ్రెగ్జిట్, లాక్డౌన్, కోవిడ్-19, స్పోర్ట్స్ కార్యక్రమాలు, రామాయణ మహాభారత లాంటి సినిమాలు తొలిసారి ప్రదర్శనకు వచ్చిన సమయం, 1976 ఎమర్జెన్సీ సమయంలో కూడా కార్టూన్ ద్వారా ప్రజలకు తెలియజేశామని స్పష్టం చేసింది. అయితే తాము ఎవరిపట్ల పక్షపాతంతో వ్యవహరించకుండా ఉన్నది ఉన్నట్లుగా క్రియేటివ్గా మాత్రమే ప్రజలకు కార్టూన్ల ద్వారా తెలిపామని స్పష్టం చేసింది. అయితే ట్విటర్ స్పందన మాత్రం మరోలా ఉంది. భారత్-చైనాల మధ్య గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న క్రమంలో ట్విటర్పై అమూల్ ఇలాంటి పోస్టులు పెట్టడంతో ఇది మరింత గందరగోళం, ఆందోళనకు దారి తీయొచ్చని భావించి అమూల్ సంస్థ మేలుకోసమే ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసినట్లు ట్విటర్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ట్విటర్ క్యాప్షాను సరిచేస్తే తిరిగి అకౌంట్ యాక్టివేట్ అవుతుందని ట్విటర్ యాజమాన్యం వివరణ ఇచ్చింది.