ట్విట్టర్ దుస్సాహసం: జమ్మూ కాశ్మీర్, లఢక్ చైనాలో భాగం: వార్ మెమొరియల్ సైతం డ్రాగన్ కంట్రీదే
న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్విట్టర్ దుస్సాహసానికి పాల్పడింది. భారత్లో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్, లఢక్ కేంద్ర పాలిత ప్రాంతాలను చైనాలో భాగంగా చూపిస్తోంది. జాతీయ భద్రతా విశ్లేషకుడు నితిన్ గోఖలే దీనికి సంబంధించిన ఓ కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ట్విటర్ ఇండియా యాజమాన్యం.. చైనాలో భాగంగా చూపిస్తున్నట్లు ఆయన పక్కా సమాచారం అందడంతో.. ఆయన దీన్ని పరీక్షించి చూశారు. నిర్ధారించారు.
See this Twitter! When I put Hall of Fame Leh as the location, see what it shows. I tested it deliberately.@Twitter @TwitterIndia @TwitterSupport pic.twitter.com/sGMbmjJ60c
— Nitin A. Gokhale (@nitingokhale) October 18, 2020
జమ్మూ కాశ్మీర్ పిన్ పాయింట్ను ట్విట్టర్.. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా చూపించింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ను ఆయన అదే ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. లేహ్లోని కుషొక్ బకుళా రింపోఛె విమానాశ్రయం పిన్ పాయింట్ను కూడా ట్విట్టర్.. చైనాలో భాగంగా చూపించింది. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు.. ఈ అంశాన్ని వెంటనే పరిష్కరించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్ని పరీక్షించడానికి ఆయన జమ్మూ కాశ్మీర్, లేహ్లల్లో స్వయంగా పర్యటించారు.
ఈ రెండుచోట్లా ఆయన ఎక్కడికి వెళ్లినా ఆయా ప్రదేశాలను చైనాలో భాగంగా చూపించినట్లు వెల్లడించారు. సాంకేతికపరమైన సమస్యగా దీన్ని భావించాల్సి ఉంటుందని నితిన్ గోఖలే పేర్కొన్నారు. ఇందులో దురుద్దేశం ఏదైనా ఉంటే.. దానిపై విచారణ జరిపించాలని అన్నారు. అత్యంత సమస్యాత్మకమైన, కోట్లాదిమంది భారతీయుల మనోభావాలతో ముడిపడి ఉన్న జమ్మూ కాశ్మీర్, లఢక్ ప్రాంతాలను చైనాలో భాగంగా చూపించడం పట్ల కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
— Nitin A. Gokhale (@nitingokhale) October 18, 2020
ఈ వివాదంపై కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించాలని, ఓ ప్రకటన విడుదల చేయాలని అంటున్నారు. జమ్మూ కాశ్మీర్లోని హాల్ ఆఫ్ ఫేమ్ యుద్ధ స్మారక చిహ్నాన్ని నిర్మించిన ప్రదేశాన్ని కూడా చైనాలో భాగంగా చూపించడం తనకు ఆశ్చర్యానికి గురి చేసిందని నితిన్ గోఖలె అన్నారు. తాను తిరిగిన ప్రదేశాలకు సంబంధించిన లైవ్ వీడయోను చైనా నుంచి టెలికాస్ట్ చేస్తున్నట్లు సమాచారం అందుతోందని ఆయన పేర్కొన్నారు.