తక్షణ అమలేదీ ? - ట్విట్టర్పై కేంద్రం అసహనం- రైతు నిరసనల పోస్టుల తొలగింపులో ఆలస్యంపై
రైతు నిరసనలకు సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్లో వ్యాప్తి చేస్తున్న దాదాపు వెయ్యి ఖాతాలను వెంటనే నిలిపేయాలంటూ తాజాగా కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్కు ఆదేశాలు ఇచ్చింది. అయితే వాటిపై ఆలస్యంగా స్పందించిన ట్విట్టర్ వాటిని నిలిపేసింది. దీనిపై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు కూడా వెంటనే అమలు కాకపోతే ఎలా అంటూ ట్విట్టర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల సాగిస్తున్న నిరసనలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ సెలబ్రిటీలు కూడా వాడుతున్న ట్విట్టర్లో రైతు నిరసనల సమాచారం క్షణాల్లో వ్యాప్తిస్తోంది. ఇది దేశ దేశాలకు చేరిపోతోంది. దీంతో ఆయా సెలబ్రిటీలు, విదేశీ ఎన్జీవోలు సైతం రైతు నిరసనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇది కేంద్రానికి తలనొప్పిగా మారింది. దేశంలో జరుగుతున్న పరిణామాలను నియంత్రించలేకపోతున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
దీంతో కేంద్రం రైతు నిరనసలకు సంబంధించిన సమాచారాన్ని, ఫొటోలు, వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్న వారిపై నిఘా పెట్టింది. ఇలా గుర్తించిన దాదాపు వెయ్యి ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలని ట్విట్టర్కు ఆదేశాలు ఇచ్చింది. అయితే కేంద్రం ఆదేశాలు ఇచ్చిన వెంటనే ట్విట్టర్ వాటిని బ్లాక్ చేయలేదు. రెండు రోజుల తర్వాత వాటిని తొలగించింది.
దీనిపై తాజాగా కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారికంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అత్యవసర ఆదేశాలను కూడా పాటించకపోతే ఎలా అంటూ ట్విట్టర్ను ప్రశ్నించింది. అంతే కాదు భారత్లో ఉండాలనుకుంటే ఇక్కడి చట్టాలను, ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సిదేనని స్పష్టం చేసింది.