దుమారం: మోడీ భారత్ని అవమానించారు, ఫ్రెండ్ అని ఒబామా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఓ ట్వీట్ దుమారం రేపుతోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో తాము అధికారం చేపట్టకముందు భారత్లో జన్మించిన వారుగా చెప్పుకునేందుకు మీరంతా సిగ్గుపడ్డారని, తాము పరిపాలన చేపట్టిన తర్వాత భారత దేశ ప్రతినిధులమని చెప్పుకునేందుకు గర్వపడుతున్నారని.. ఆయన చైనా, దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ వివాదానికి కారణమైంది. ఆయన ట్వీట్ పైన కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రధాని స్థాయిన మర్చిపోతున్నారని, ఆ స్థాయిని దిగజార్చుతున్నారని మండిపడ్డారు.
చెత్త రాజకీయాలకు పాల్పడకుండా ప్రధాని హోదాకు ఉన్న గౌరవాన్ని కాపాడాలన్నారు. భారతీయులమని చెప్పుకునేందుకు ఎవరూ, ఎప్పుడూ సిగ్గుపడి ఉండరని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తొలి ప్రధాని మోడీయే అంటూ సామాజిక అనుసంధాన వెబ్ సైట్లలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మోడీతో స్నేహంపై ఒబామా
భారత ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం ఆసక్తికర వ్యాఖ్య చేశారు. మోడీతో తనకు వ్యక్తిగత స్నేహం ఉందని చెప్పారు. మోడీతో వేదిక పంచుకున్న సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. అమెరికాలో రాయబారి జైశంకర్ స్థానంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన అరుణ్ సింగ్.. ఒబామాను కలిశారు. ఈ సందర్భంగా ఒబామా మోడీతో తన దోస్తీపై వ్యాఖ్యానించారు.