చైనా మ్యాప్లో లడఖ్- ట్విట్టర్ సమాధానంపై అసంతృప్తి- చర్యలకు సిద్ధమవుతున్న కేంద్రం..
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తమ తాజా మ్యాప్లో భారత్లోని లడఖ్ను చైనాలో భాగంగా చూపడంపై కేంద్రం మండిపడుతోంది. ఈ వ్యవహారంపై ట్విట్టర్ ఇచ్చిన వివరణ కూడా కేంద్రాన్ని సంతృప్తిపరచలేదని తెలుస్తోంది. దీంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక ఆధారంగా ట్విట్టర్పై న్యాయపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
భారత భూభాగంలో ఉన్న లడఖ్ను చైనా మ్యాప్లో భాగంగా చూపడంపై ట్విట్టర్ ప్రతినిధి ఇవాళ సంయుక్త పార్లమెంటు కమిటీ సభ్యుల ముందు విచారణకు హాజరైనట్లు కమిటీ ఛైర్పర్సన్, బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖీ వెల్లడించారు. ట్విట్టర్ ప్రతినిధి తమ చర్యపై స్పందిస్తూ భారత్ మనోభావాలను తాము గౌరవిస్తామని చెప్పినట్లు లేఖీ పేర్కొన్నారు. కానీ ఇది భారత్ మనోభావాలతోనే కాదు సార్వభౌమత్వానికి, సమగ్రతతో కూడుకున్న అంశమని లేఖీ తెలిపారు. విచారణ సందర్భంగా ట్విట్టర్ ప్రతినిధి ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని కమిటీలోని సభ్యులు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు మీనాక్షీ లేఖీ వెల్లడించారు.
ట్విట్టర్ చేసిన పని క్రిమినల్ నేర పరిధిలోకి వస్తుందని, దీనికి ఏడేళ్ల పాటు జైలుశిక్ష విధించే అవకాశం కూడా ఉందని సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఛైర్పర్సన్ మీనాక్షీ లేఖీ తెలిపారు. ఈ విచారణకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అయితే ట్విట్టర్ చర్యను మాత్రం అందరూ ముక్త కంఠంతో తప్పుబట్టారు. దీంతో కేంద్రం ట్విట్టర్పై చర్యలు తీసుకోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. అయితే సంయుక్త పార్లమెంటరీ కమిటీ సూచించే నివేదిక ఆధారంగానే ఈ చర్యలు ఉండొచ్చని తెలుస్తోంది.