కేరళ వరదలు: రూ.12వేల కోట్ల పేటీఎం అధినేత విరాళం రూ.10వేలు
Recommended Video
న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళ అతలాకుతలమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చేయూత అందించింది. పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. దాదాపు రూ.20వేలకోట్ల నష్టం సంభవించింది.
కేరళ వరదలపై దేశవ్యాప్తంగా అందరూ స్పందిస్తున్నారు. సామాన్యులు తమవంతు వస్తు, దుస్తులు, ఆహారం, ఇతర రూపాల్లో సాయం అందిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు తమవంతుగా డబ్బులతో చేయూత అందిస్తున్నారు.
అయితే ప్రముఖ పేటీఎం అధినేత విజయ్ శేఖర శర్మ చేసిన సాయం నెటిజన్ల విమర్శలకు తావిచ్చింది. ఆయన సంపద రూ.12వేల కోట్లు. కానీ ఆయన ఇచ్చిన విరాళం రూ.10వేలు. దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
కేరళ వరద బాధితుల కష్టాలు చూసి, కరిగిపోయి, పెద్ద మనసుతో రూ. 10 వేలు విరాళం ఇచ్చారు. ఇవ్వడమమే కాదు.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తన దానానికి రుజువుగా రసీదును కూడా జత చేశారు. పనిలో పనిగా విరాళాలను ఇచ్చేందుకు తమ పేటీఎంను వాడుకోవాలని పిలుపునిచ్చారు. దీనిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
సమాజంలో నీ స్థాయి ఏమిటి? నీవిచ్చే విరాళం ఏమిటి? అంటూ కొందరు జనాల సొమ్ముతో రూ.12 వేల కోట్లు సంపాదించి ఇప్పుడు అదే జనాలకు రూ.10 వేల ముష్టి వేస్తావా? అంటూ మరికొందరు మండిపడ్డారు. డబ్బు వెనక్కి తీసుకుని నీ పెంపుడు కుక్కలకు పెట్టు అంటూ కొందరు విమర్శించారు. విమర్శకుల దెబ్బకు విజయ్ శేఖర్ శర్మ వెంటనే ట్విట్టర్ నుంచి ట్వీట్ ను తొలగించారు. కానీ, అప్పటికే స్క్రీన్ షాట్లు తీసిన నెటిజెన్లు దానిని వైరల్ చేశారు.
అత్యంత ధనవంతుడైన విజయ్ శేఖర్ రూ.10వేల పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇచ్చి, పేటీఎం ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.