నాకో అద్దె ఇల్లు కావాలి, స్వంత ఇల్లు నిర్మించుకోక తప్పు చేశా: అఖిలేష్
లక్నో: స్వంత ఇల్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు. స్వంత ఇంటిని నిర్మించుకోకుండా తప్పు చేశానని ఆయన వ్యాఖ్యానించారు. తనకు లక్నోలో నివాసం ఉండేందుకు ఓ అద్దె ఇల్లు కావాలని అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా కోరారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ నివాస గృహల్లో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రులను ఆ బంగ్లాలను ఖాళీ చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అధికారులు మాజీ ముఖ్యమంత్రులకు నోటీసులు జారీ చేశారు.
ఈ నోటీసులు అందుకొన్న వారిలో అఖిలేష్ యాదవ్ కూడ ఉన్నారు. దీంతో అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం తాను నివాసం ఉండేందుకు ఓ ఇంటికి వెతుకుతున్నారు. ఈ మేరకు తనకు అద్దెకు ఓ ఇల్లు కావాలని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటివరకు తనకు స్వంత ఇల్లు కూడ లేదన్నారు.
ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి అద్దె ఇంటికి మారేందుకు కొంత సమయం ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టును కోరినట్టు ఆయన చెప్పారు. అయితే కోర్టు సమయం ఇస్తే గడువులోపుగా స్వంత ఇల్లు నిర్మించుకొంటానని ఆయన చెప్పారు.
యూపీలో మాజీ ముఖ్యమంత్రులంతా సుప్రీం ఆదేశాల మేరకు తాము నివాసం ఉంటున్న గృహాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నోటీసులు అందుకొన్నవారు ఈ గృహలను ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాల అనంతరం ఖాళీ చేయాల్సిందిగా ఉత్తర్వులు అందుకున్న వారిలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాజస్తాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్, ఎన్డీ తివారీలు కూడా ఉన్నారు. అఖిలేష్ యాదవ్ లక్నోలోని విక్రమాదిత్య రోడ్డు 4 నెంబర్ ప్రభుత్వ బంగ్లాలో ఉండగా, అదే విధిలో ఐదో నెంబర్ బంగ్లాలో గత 27 ఏళ్లుగా ములాయం సింగ్ యాదవ్ ఉంటున్నారు.