బెంగళూరులో కుప్పకూలిన యుద్ధ విమానం...ఇద్దరు పైలట్లు మృతి
బెంగళూరు: బెంగళూరులో విమాన ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయంలో ఈ దుర్ఘటన జరిగింది. మిరాజ్ 2000 యుద్ధ విమానం ట్రయల్స్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన పైలట్లు స్క్వాడ్రన్ లీడర్ సమీర్ అబ్రోల్, స్క్వాడ్రన్ లీడర్ సిద్దార్థ్ నేగిలుగా గుర్తించినట్లు హాల్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఘటన శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగినట్లు హాల్ అధికారులు వెల్లడించారు. మిరాజ్ 2000 యుద్ధ విమానంలో జీరో జీరో(జీరో స్పీడ్, జీరో అల్టిట్యూడ్) వ్యవస్థ అమర్చి ఉంటుంది. అంటే విమానం భూమిపై ఉన్న సమయంలో కూడా సీటుతో సహా పైలట్లు బయటపడే అవకాశం ఉంది. అయితే పైలట్లు బయటకు దూకాలని ప్రయత్నించిన సమయంలో విమానం ఏదశలో ఉందో అనేదానిపై స్పష్టత రాలేదని వెల్లడించారు.
మిరాజ్ 2000 యుద్ధ విమానం ప్రమాదానికి సంబంధించి విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ యుద్ధ విమానాలను తయారు చేయడమే కాకుండా వాటిని అప్గ్రేడ్ కూడా చేసి ట్రైయినింగ్కు వినియోగిస్తుంది. అంతేకాదు బెంగళూరులోని మిలటరీ ఎయిర్పోర్టు నిర్వహణ బాధ్యతలు కూడా హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ చూసుకుంటోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫ్రాన్స్లో తయారైన 50 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిని ప్రస్తుతం అప్గ్రేడ్ చేస్తున్నారు. 1985 నుంచి ఈ యుద్ధ విమనాలు భారత రక్షణ రంగంలో సేవలందిస్తున్నాయి.