మాజీ సీఎం నకిలి సంతకంతో రూ. 200 కోట్లు లూటీకి ప్రయత్నాలు, 50 మంది, చివరికి పోలీసులు!
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నకిలి సంతకంతో రూ. 200 కోట్లు లూటీ చెయ్యాలని ప్రయత్నించారని వెలుగు చూసింది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నకిలి సంతకం చేసిన ఇద్దరిని బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈ కేసులో మొత్తం 50 మందిని పోలీసులు విచారణ చేశారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్
గురునాథ్, సిధ్దారూడ అనే ఇద్దరిని పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడి కార్యాలయంలో గురునాథ్ పని చేస్తున్నాడు. సిధ్దారూడ తిమ్మాపురలో కురుబ సంఘం నాయకుడు. నిందితులు ఇద్దరూ చేసిన ఫోర్జరీ కథను పోలీసులు వివరించారు.
భవనం నిర్మాణం
బెళగావి జిల్లా సంగోళ్ళిలో కురుబ సంఘం భవన నిర్మాణానికి రూ. 200 కోట్లు నిధులు మంజూరు చెయ్యాలని వెనుకబడిన వర్గాల శాఖ కార్యాలయం ప్రధాన కార్యదర్శికి లేఖ సమర్పించారు. వెనుకబడిన వర్గాల కార్యాలయానికి సమర్పించిన లేఖలో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంతకం ఉంది.
అధికారులకు అనుమానం !
ఒక్క భవనం నిర్మాణానికి రూ. 200 కోట్లు నిధులు మంజూరు చెయ్యాలని లేఖ రావడంతో అధికారులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో సిధ్దారూడ కురుబ కులస్తుల భవన నిర్మాణానికి రూ. 200 కోట్లు నిధులు మంజూరు చెయ్యాలని 2016లో అర్జీ సమర్పించారని వెలుగు చూసింది.
విధాన సౌధాలో ఆరా !
ప్రతినిత్యం విధాన సౌధకు భేటీ అయ్యే సిధ్దారూడా నిధులు మంజూరు అయ్యాయా ? లేదా ? అంటూ వివరాలు సేకరించేవాడు. నిధులు మంజూరు కాకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నకిలి సంతకంతో అధికారులకు లేఖ ఇచ్చారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
మాజీ సీఎం సంతకం టార్గెట్ !
మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నకిలి సంతకం లేఖ కేసులో పోలీసులు మొత్తం 50 మందిని విచారణ చేశారు. చివరికి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మొదట విధాన సౌధ పోలీసులు కేసు నమోదు చేసినా చివరికి కబ్బన్ పార్క్ పోలీసులకు కేసు బదిలి చేశారు. నిందితులు ఇద్దరూ ఇలా ఎన్ని నకిలి సంతకాలతో అధికారులు, ప్రజలను మోసం చేశారు అంటూ పోలీసులు విచారణ చేస్తున్నారు.