ఉన్నావ్ రేప్: ఎమ్మెల్యే భార్యనే రూ. కోటి డిమాండ్, ఇద్దరు అరెస్ట్
లక్నో: ఉన్నావ్ రేప్ కేసును మాఫీ చేపిస్తామని సాక్షాత్తూ ఎమ్మెల్యే భార్యను రూ. కోటి డిమాండ్ చేసిన భాగోతాన్ని లక్నో పోలీసులు గుట్టు రట్టు చేశారు. లక్నో నగరానికి చెందిన అలోక్ , విజయ్లు ఉన్నావ్ రేప్ కేసులో బ్లాక్ మెయిలింగ్కు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు.
ఉన్నావ్ రేప్ కేసులో ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఈ విషయమై కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అతడిని అరెస్ట్ చేసింది.ఈ కేసులో అరెస్టైన ఎమ్మెల్యే ప్రస్తుతం జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే రాజకీయంగా దురుద్దేశ్యపూర్వకంగా తనపై ఈ కేసును బనాయించారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ కేసులో అరెస్టై జైల్లో శిక్షను అనుభవిస్తున్న బిజెపి ఎమ్మెల్యే సతీమణికి ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేశారు. బిజెపి నాయకుడిగా చెప్పుకొన్న ఆ వ్యక్తి ఈ కేసు నుండి ఎమ్మెల్యేను తప్పించేందుకు రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు అలోక్ అనే వ్యక్తి .అంత డబ్బును తాను ఇవ్వలేనని ఎమ్మెల్యే సతీమణి చెప్పడంతో రూ. 50 లక్షలు ఇవ్వాలని చెప్పాడు.
రెండో రోజున విజయ్ అనే వ్యక్తి తాను సీబీఐ అధికారి రాజీవ్ మిశ్రానని పరిచయం చేసుకొన్నాడు. అంతేకాదు ఎమ్మెల్యే విడుదల కోసం తాను సహకరిస్తానని చెప్పాడు. డబ్బును లక్నోలోని సీబీఐ కార్యాలయంలో ఇవ్వాలని ఫోన్లో చెప్పాడు.
ఈ రెండు ఫోన్ కాల్స్ గురించి ఎమ్మెల్యే సతీమణి తన బంధువులకు చెప్పింది.దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ పోన్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తును చేశారు. ఈ ఫోన్ కాల్స్ ఘాజీపూర్ నుండి వచ్చాయని తేలింది. దీంతో నిందితులను పోలీసులు వలపన్ని పట్టుకొన్నారు. రేప్ కేసులో ఎమ్మెల్యే భార్యను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు రాబట్టుకొనేందుకు ప్రయత్నం చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.