ఇంత దారుణమా..! : 'ఆవు మూత్రం తాగించి.. పేడ తినిపించి..'
న్యూఢిల్లీ : అక్రమంగా బీఫ్ ను తరలిస్తున్నారన్న కారణంగా ఇద్దరు యువకులతో ఆవు మూత్రం తాగించి, పేడ తినిపించారు గో సంరక్షణ సమితి సభ్యులు. గో సంరక్షణ సమితి సభ్యులు చేసిన ఈ నిర్వాకం సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో విషయం కాస్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
న్యూఢిల్లీకి సమీపంలోని గుర్గావ్ లో గో సంరక్షణ సమితి అధ్యక్షుడు ధర్మేంద్ర యాదవ్, అతని అనుచరులు కలిసి రిజ్వాన్ ముక్తియర్ అనే ఇద్దరు ముస్లిం యువకుల పట్ల పైశాచికంగా వ్యవహరించారు. యువకులిద్దరు ఏడు వందల కేజీల గొడ్డు మాంసాన్ని అక్రమంగా తరలిస్తుంటే పట్టుకున్నామని ఆరోపిస్తోన్న గోరక్షణ సమితి సభ్యులు.. అందుకు గుణపాఠంగా ఆవు మూత్రం, పేడ, పాలు, పెరుగు, నెయ్యిల మిశ్రమమైన పంచగవ్యను వాళ్లతో తినిపించామని తెలిపారు.
పంచగవ్యను తినిపించడం ద్వారా వాళ్లను పరిశుద్దులని చేసినట్టు సదరు గోరక్షణ సమితి సభ్యులు ప్రకటించడం గమనార్హం. అనంతరం వారిని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించగా.. 300 కేజీల బీఫ్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీస్ అధికారి ఫరిదా వెల్లడించారు. అయితే యువకులకు ఆవు మూత్రం తాగించడం, పేడ తినిపించడం లాంటి విషయాలేవి తమ దృష్టికి రాలేదని పోలీసులు పేర్కొనడం మరిన్ని చర్చలకు తావిస్తోంది.