9,10 ఏళ్ల పిల్లలు యువకుడిని బీర్ బాటిల్తో గొంతు కోసి చంపారు
న్యూఢిల్లీ: మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వలేదని ఒక వ్యాపారిని ఇద్దరు పిల్లలు (భిక్షగాళ్లు) అతి దారుణంగా హత్య చేసిన సంఘటన దేశ రాజధాని డిల్లీలో జరిగింది. పూల వ్యాపారిని హత్య చేసిన 9, 10 సంవత్సరాల ఇద్దరు పిల్లలను పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఢిల్లీలోని గోవింద్ పుర ప్రాంతంలోని దేవాలయం దగ్గర సంజయ్ కుమార్ (23) అనే వ్యక్తి పూల వ్యాపారం చేస్తున్నాడు. ఇతను శుక్రవారం రాత్రి వ్యాపారం ముగించుకుని పక్క షాప్ లో మద్యం సేవిస్తున్నాడు. అదే సమయంలో (9), (10) వయస్సు ఉన్న ఇద్దరు బాలురు అక్కడికి వెళ్లారు.
డబ్బులు (భిక్షం) ఇవ్వాలని సంజయ్ కుమార్ను అడిగారు. డబ్బులు ఇవ్వడానికి అతను నిరాకరించాడు. డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. సంజయ్ కుమార్ కు కోపం వచ్చి ఒక బాలుడి చెంప చెల్లుమనిపించాడు. అంతే మరో బాలుడు రెచ్చిపోయాడు.
పక్కనే ఉన్న బీరు బాటిల్ తీసుకుని సంజయ్ కుమార్ తల మీద కొట్టాడు. సంజయ్ కుమార్ కిందపడిపోవడంతో ఇంకొక బాలుడు అతని మీద కూర్చుని పగిలిపోయిన బీర్ బాటిల్ తీసుకుని సంజయ్ కుమార్ గొంతు కోసి వేశాడు. ఆ సందర్బంలో సంజయ్ కుమార్ ఇద్దరిని పక్కకు నెట్టి పారిపోవడానికి ప్రయత్నించాడు.
అయితే నిందితులు ఇద్దరు అతనికి అవకాశం ఇవ్వలేదు. తరువాత డబ్బులు లాక్కుని అక్కడి నుండి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంజయ్ కుమార్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే అర్దం గొంతు తెగిపోవడం, రక్తం ఎక్కువ పోవడంతో సంజయ్ కుమార్ మరణించాడని పోలీసులు అన్నారు. ఢిల్లీలో రిక్షా కార్మికులుగా పని చేస్తున్న వారి ఇద్దరు పిల్లలు ఇంటి నుండి పారిపోయి వచ్చి భిక్షం ఎత్తుకుంటు బ్రతుకుతున్నారని, ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.