పుట్టిన రోజు వేడుకల్లో విషాదం: బెంగళూరులో జ్యూస్ అనుకుని యాసిడ్ తాగి ఇద్దరు మృతి !
జ్యూస్ అనుకుని యాసిడ్ తాగి ఇద్దరు చిన్నారులు మరణించిన ఘటన బెంగళూరు నగరంలోని కేఆర్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బెంగళూరు: జ్యూస్ అనుకుని యాసిడ్ తాగి ఇద్దరు చిన్నారులు మరణించిన ఘటన బెంగళూరు నగరంలోని కేఆర్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అవెన్యూ రోడ్డు సమీపంలోని కిలారి రోడ్డులో నివాసం ఉంటున్న ఆర్యన్ సింగ్ (9), సాయిల్ శంకర్ (8) అనే ఇద్దరు చిన్నారులు యాసిడ్ చేసివించి మృతి చెందారని గురువారం పోలీసులు చెప్పారు.
కిలారి రోడ్డులో ఉత్తరప్రదేశ్ కు చెందిన సంజయ్ సింగ్, అంజు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు ఆర్యన్ సింగ్. అర్యన్ సింగ్ పుట్టిన రోజు బుధవారం (సెప్టెంబర్ 27) జరిగింది. ఆర్యన్ సింగ్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడానికి అతని స్నేహితుడు సాయిల్ శంకర్ రాత్రి అతని ఇంటికి వెళ్లాడు.
ఆర్యన్ సింగ్ తండ్రి బంగారు, వెండి వస్తువులు శుభ్రం చేసే పని చేస్తున్నాడు. బంగారు, వెండి శుభ్రం చెయ్యడానికి ఆర్యన్ సింగ్ తండ్రి సంజయ్ సింగ్ జ్యూస్ బాటిల్ లో యాసిడ్ తీసుకు వచ్చి ఇంటిలో పెట్టాడు. తన పుట్టిన రోజు వేడుకకు వచ్చిన స్నేహితుడికి జ్యూస్ ఇవ్వాలని ఆర్యన్ సింగ్ భావించాడు.
జ్యూస్ బాటిల్ లో ఉన్న యాసిడ్ ను రెండు గ్లాసుల్లో తీసుకు వచ్చిన ఆర్యన్ సింగ్ అతని స్నేహితుడు సాయిల్ శంకర్ తో కలిసి తాగాడు. యాసిడ్ శరీరంలోకి వెళ్లి ఇద్దరూ అస్వస్థతకు గురైనారు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై ఆర్యన్ సింగ్, సాయిల్ శంకర్ మరణించారని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.