మోడీ ముందు రెండే మార్గాలు: ఉగ్రదాడులను ఎలా తిప్పి కొడుతారు..?
పుల్వామాలోని అవంతిపురాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. జమ్మూకశ్మీర్ చరిత్రలోనే భద్రతా బలగాలపై ఇలాంటి పెద్ద దాడి జరగడం తొలిసారి. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీపై 2001లో జరిగిన దాడులతో ఈ దాడులను పోల్చుతున్నారు. నాడు కూడా ఓ ఉగ్రవాది దాడులకు పాల్పడేందుకు కారునే వినియోగించాడు. గురువారం జరిగిన దాడిలో కూడా ఉగ్రవాది కారునే దాడులకు ఉపయోగించి దారుణానికి ఒడిగట్టాడు.
మోడీ ప్రభుత్వం పాక్ భరతం పడుతుందా..?
జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిపై ప్రపంచదేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. భారత్లో కూడా పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయపార్టీలు పాకిస్తాన్ పై విరుచుకుపడ్డాయి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆదేశానికి క్షేమకరం కాదని నిప్పులు చెరిగాయి. కొన్ని నెలల్లో దేశం సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద దాడి జరగడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మరి ఈ దాడులపై మోడీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుందా...? సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పాక్ భరతం పడుతుందా..? మోడీ ముందున్న ఛాయిస్ ఏమిటనేదానిపై ఒకసారి విశ్లేషిద్దాం.
ప్రతికారమా... శాంతి మంత్రమా
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల దాడి తర్వాత మోడీ ప్రభుత్వం ముందు రెండు ఛాయిస్లు మాత్రమే ఉన్నాయి. ఇంత దారుణానికి పాల్పడిన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ ఆక్రమిత భారత్లో 2016 సెప్టెంబర్ 29న చేసినట్లుగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడం లేదా చర్చలు జరపడం కానీ చేయాల్సి ఉంటుంది. ముందుగా చర్చలు జరిపితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి... దాని వల్ల లాభం ఏమైనా చేకూరుతుందా... పాకిస్తాన్లో మార్పు ఏమైనా వస్తుందా అనేది చూద్దాం.
మొదటి ఛాయిస్: పాకిస్తాన్తో చర్చలు
ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సత్సంబంధాలు లేవు. ఇక తాజా ఘటనతో పాకిస్తాన్ పై ఎనలేని ఆగ్రహంతో ఉంది భారత్. దీంతో భారత్ అమెరికాను ఆశ్రయించే అవకాశం ఉంది. అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గంగా మారిందని ఆగష్టు 2017లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ఆపాలని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే అమెరికా పాకిస్తాన్కు ఆర్థిక సాయం కూడా నిలిపివేసింది. అఫ్ఘానిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం ఆపివేస్తూ తాము కూడా ఓ బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తామని పాకిస్తాన్ ముందుకు వచ్చి అమెరికా దగ్గర మార్కులు కొట్టేసింది.
మసూద్ అజర్కు అండగా డ్రాగన్ కంట్రీ
ఇక చైనా విషయానికొస్తే... కొన్నేళ్లుగా జైష్-ఈ-మొహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్కు చైనా అండగా నిలుస్తోంది. ఐక్యరాజ్య సమితి తన 1267 కమిటీల్లో మసూద్ అజర్ను ఉగ్రవాదిగా ముద్రవేసినప్పటికీ ..చైనా మాత్రం అజర్ చాలామంచి వాడు అంటూ కితాబిచ్చింది. సైనో -భారత్ చర్చలు, గతేడాది ఏప్రిల్లో జరిగిన మోడీ-జిన్పింగ్ చర్చల తర్వాత కూడా మసూద్ అజార్కు మద్దతుగా నిలిచింది డ్రాగన్ కంట్రీ. 2001 అక్టోబర్ 17న జైషే మహ్మద్ సంస్థను నిషేధించడం జరిగింది. అయితే మసూద్ అజర్ను కూడా నిషేధించాలని భారత్ పట్టుబట్టింది.
మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయాలని ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్య దేశాలుగా గుర్తింపుకలిగి ఉన్న అమెరికా, ఫ్రాన్స్ , బ్రిటన్ దేశాలు పట్టుబట్టాయి. అయితే కొన్ని కుంటి సాకులు చూపిన చైనా నిర్ణయం తీసుకునేందుకు మరికొంత కాలం కావాలని గతేడాది ఆగష్టులో వెల్లడించింది. గతేడాది సెప్టెంబరులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ... మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేయాలన్న భారత్ ప్రతిపాదనపై నీళ్లు చల్లారు. ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్య దేశాలు అన్నీ కూడా మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేయాలన్న ఏకాభిప్రాయానికొస్తే తాము కూడా సిద్ధమే అని చెప్పారు. కానీ వాస్తవానికి అన్ని శాశ్వత సభ్య దేశాలు మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేయాలని చెబుతుంటే ఒక్క చైనా మాత్రమే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. మరోవైపు పాకిస్తానే అన్ని దాడులకు పాల్పడిందనేదానికి రుజువులు చూపించాలనే వితండవాదం తెరపైకి తీసుకొచ్చింది డ్రాగన్ కంట్రీ. ఓ వైపు ఉగ్రవాదానికి తాము వ్యతిరేకం అని చెబుతూనే... మరోవైపు పాకిస్తాన్కు చైనా అన్ని విధాలా మద్దతు ఇస్తోంది. అంతేకాదు అఫ్ఘానిస్తాన్లోని ఆల్ ఖైదా ఉగ్రవాదులతో పాక్ పోరాడి చాలా కోల్పోయిందంటూ కితాబు కూడా ఇచ్చింది. ఇక భారత్ చైనాలు పలుమార్లు చర్చలు జరిపినప్పటికి కూడా అన్ని సమస్యలపై ఇరుదేశాలు పరిష్కారం దిశగా వెళ్లాయి కానీ... ఒక్క మసూద్ అజార్ విషయంలోనే చైనా భారత్కు సహకరించడం లేదనేది వాస్తవం.
భారత్కు ఉన్న రెండో ఛాయిస్ సర్జికల్ స్ట్రైక్స్
ఇక పాక్ ఉగ్రవాదులను అంతమొందిచేందుకు భారత్కు ఉన్న రెండో ఛాయిస్ సర్జికల్ స్ట్రైక్స్. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసి చాలామంది ఉగ్రమూకలను మట్టుబెట్టాయి భారత దళాలు. అయితే నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఉగ్రవాద స్థావరాలను పెద్దగా ధ్వంసం చేయలేదు. దీంతో సర్జికల్ స్ట్రైక్స్ అసలు జరగలేదని పాక్ ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసి కొంతవరకు సఫలమైంది. అంతేకాదు సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్తాన్ తిరిగి భారత్పైకి యుద్ధానికి దిగకపోవడంతో భారత్ చెబుతున్న సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదనే సంకేతాలను పాక్ ప్రపంచదేశాలకు పంపింది. అయితే పుల్వామాలో జరిగిన దాడితో మోడీ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతారు. ఈ సారి ప్రపంచం మొత్తం తెలిసేలా యుద్ధానికి దిగుతారా లేక సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్రవాదులు స్థావరాలను ధ్వంసం చేసి భారత్ సత్తా చాటుతారా అనేది వేచి చూడాలి. అయితే నరేంద్ర మోడీ ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దేశం తనవెంట ఉంటానంటోంది.