గుజరాత్ ఎన్నికలు, ఒకే సీటుకు ఇద్దరికి బీఫాం ఇచ్చిన కాంగ్రెస్, నామినేషన్ వేశారు, ఎలా!
అహ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పప్పులో కాలేసింది. ఒకే శాసన సభ నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు నాయకులకు బీఫాం ఇవ్వడంతో ఇద్దరూ నామినేషన్ వేశారు.
సూరత్ లోని కమ్రిజ్ శాసన సభ నియోజక వర్గంలో పోటీ చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన అశోక్ జిరివాలా, నీలేష్ కుంబాని పోటీ పడ్డారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో అశోక్ జిరివాలా పేరు ఉంది. సోమవారం అశోక్ జిరివాలా తన మద్దతుదారులతో వెళ్లి అట్టహాసంగా నామినేషన్ వేశారు.
సోమవారం రాత్రిపోద్దు పోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో కమ్రజ్ నియోజక వర్గంలో పోటీ చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నీలేష్ కుంబానికి సూచించింది. మంగళవారం ఉదయం బీఫాం తీసుకున్న నీలేష్ కుంబాని అదే నియోజక వర్గంలో నామినేషన్ దాఖలు చేశారు.
ఒకే నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి ఇద్దరికీ కాంగ్రెస్ పార్టీ బీఫాంలు ఇవ్వడంతో ఎన్నికల కమిషన్ అధికారులు వారి నామినేషన్లు తిరస్కరించలేకపోయారు. గురువారం గడువులోపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు ఎవరు నామినేషన్ పత్రాలను వితడ్రా చేసుకుంటారో వేచి చూడాలని ఎన్నికల కమిసన్ అధికారి కేజీ. వాగేలా అంటున్నారు. డిసెంబర్ 9వ తేదీన కమ్రజ్ నియోజ్ నియోజక వర్గంలో ఎన్నికలు జరగనున్నాయి.