తెలంగాణలో తిష్ట వేసిన కరోనా: పాజిటివ్ కేసు: దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తిలో: కేంద్రం కన్ఫర్మ్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ తెలంగాణలో తిష్ఠ వేసింది. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. ఆయనకు నిర్వహించిన పరీక్షల ద్వారా ఈ విషయం బహిర్గతమైంది. ప్రస్తుతం ఆ వ్యక్తి సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు తేలింది. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. తెలంగాణ సహా ఢిల్లీలో ఒకరికి ఈ వైరస్ లక్షణాలు కనిపించాయని స్పష్టం చేసింది.
సందడిగా విశాఖ ఎయిర్పోర్ట్: చైనా నుంచి స్వరాష్ట్రానికి తెలుగువారు: కరోనా వైరస్ నెగెటివ్గా తేలడంతో..
ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించిన వ్యక్తి.. దుబాయ్ నుంచి వచ్చారని పేర్కొన్నారు. కొద్దిరోజుల కిందటే దుబాయ్ నుంచి వచ్చిన ఆయన తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారని, రక్త నమూనాలను సేకరించిన డాక్టర్లు పుణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారని వివరించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్గా తేలిందని తెలిపారు.
న్యూఢిల్లీలో ఈ వైరస్ లక్షణాలు కనిపించిన వ్యక్తి ఇటీవలే ఇటలీ నుంచి స్వదేశానికి వచ్చారని, ప్రస్తుతం ఆయనను అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్)లో చికిత్స అందిస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో- రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను తాము అప్రమత్తం చేశామని, వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలను తీసుకోవాలని సూచించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఇదిలావుండగా.. తెలంగాణలో ఇదే తొలి పాజిటివ్ కేసు కావడం కలకలానికి దారి తీస్తోంది. కరోనా వైరస్ను నియంత్రించడంలో భాగంగా ఇదివరకే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా క్వారంటైన్ వార్డులను నెలకొల్పారు. అనుమానితులను అక్కడే పరీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పటిదాకా నిర్వహించిన పరీక్షలన్నీ నెగెటివ్గా తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించడం, దాన్ని కేంద్ర ప్రభుత్వం ధృవీకరించడం ఆందోళనకరంగా మారింది.