కోర్టుల తీర్పులు: రేపిస్టును పెళ్లాడిన విక్టిమ్
చెన్నై: తీవ్ర సంచలనం సృష్టించిన తమిళనాడు కడలూరు అత్యాచారం కేసు మలుపు తిరిగింది. బాధితురాలు చివరకు తనపై అత్యాచారం చేసిన రేపిస్టునే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దానికితోడు అతడిపై పెట్టిన కేసును ఉపసంహరించుకుంది.
బాధితురాలు మైనర్గా ఉన్నప్పుడు నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కోర్టులో కేసు విచారణ సమయంలో రేపిస్ట్తో చర్చించుకుని పెళ్లి చేసుకోవాలని నిరుడు జూన్ 23న మద్రాస్ హైకోర్ట్ న్యాయమూర్తి పి.దేవదాస్ సూచించారు. దీనిపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగింది.
సుప్రీంకోర్టు ఆ న్యాయమూర్తి దేవదాస్ను మందలించింది కూడా. అత్యాచారం ద్వారా తనకు పుట్టిన బిడ్డ సంక్షేమం కోసం బాధితురాలు చివరకు రేపిస్ట్నే పెళ్లి చేసుకుంది. తనను రేప్ చేసిన వ్యక్తిని తాను పెళ్లి చేసుకున్నట్లు, అతనితో తాను కలిసి జీవిస్తున్నట్లు 22 ఏళ్ల బాధితురాలు మహిళా కోర్టుకు తెలిపింది. దాంతో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.
అక్టోబర్వో జస్టిస్ ఎ సెల్వం నిందితుడి శిక్షను పక్కన పెట్టి అతనికి జరిమానా విధించారు. ఆ తర్వాత తాజా విచారణ నిమిత్తం కేసును తిరిగి కడలూరు కోర్టుకు బదిలీ చేశారు. అమ్మాయి మేజర్ అని, ఇరువురం ఏకాభిప్రాయంతో సంబంధం పెట్టుకున్నామని బాధితుడు చెప్పారు.
అత్యాచారం జరిగినప్పుడు అమ్మాయి వయస్సు 15 ఏళ్లు. 2008లో ఆ సంఘటన జరిగింది. ఈలోగా ఆమె తల్లిదండ్రులు మరణించారు. అత్యాచారం కారణంగా గర్భవతి అయిన ఆమె ఓ పాపను కూడా కన్నది. డిఎన్ఎ నమూనాలను పరీక్షించిన తర్వాత 2014లో నిందితుడిని కడలూరు మహిళా కోర్టు దోషిగా తేల్చి 2 లక్షల రూపాయల జరిమానా వేసింది.
గత అక్టోబర్లో అతని రెండో అపీల్ను హైకోర్టు పరిశీలించింది. రేప్ జరిగినప్పుడు అమ్మాయికి 15 ఏళ్లు మాత్రమే ఉన్నాయని ప్రాసిక్యూన్ ఆమె పాఠశాల బదిలీ సర్టిఫికెట్ సమర్పించారు. అంగీరించినప్పటికీ మైనర్తో సెక్స్ అత్యాచారం కిందికే వస్తుంది.
ఆమె మౌఖికంగా సమర్పించిన విషయాలపై ట్రయల్ కోర్టు ఆధారపడిందని, ఆమె వయస్సును నిర్ధారించడానికి అవసరమైన పత్రాలను పరిశీలించడంలో విఫలమైందని జస్టిస్ సెల్వం అభిప్రాయపడ్డారు. నిందితుడికి విధించిన శిక్షను పక్కన పెట్టేశారు.
కడలూరు కోర్టుకు తిరిగి కేసును విచారణ నిమిత్తం పంపించడంతో కోర్టు అమ్మాయి జన్మించిన తేదీని నిర్ధారించడానికి కోర్టు అధికారులకు సమన్లు జారీ చేసింది. కోర్టు వ్యవహారాలు రోజుల తరబడి సాగుతుండడంతో ఆమె తన పాపను కోర్టుకు తీసుకుని వెళ్లి అతన్ని పెళ్లి చేసుకుని అతని వెంట వెళ్తానని చెప్పింది.