షాకింగ్ : 'అమిత్ షా పీఏకి ఫోన్ చేస్తాం... మత విద్వేషాలు రెచ్చగొడుతాం..' రచ్చ రచ్చ..
తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ పొలిటికల్ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓ తిను బండారాల షాపు యజమానిని బెదిరింపులకు గురిచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పీఏకి ఫోన్ చేస్తామని... మత విద్వేషాలు రెచ్చగొడుతామని షాకింగ్ కామెంట్స్ చేశారు. తిన్న ఫుడ్కి బిల్లు కట్టాలని ఆ షాపు యజమాని అడిగినందుకు ఇలా నోటికొచ్చినట్లు వాగడమే కాదు... నానా రచ్చ చేశారు. గత సోమవారం(జనవరి 11) రాత్రి చెన్నైలోని ట్రిప్లికేన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అసలేం జరిగింది...
చెన్నై పోలీసుల కథనం ప్రకారం... సోమవారం రాత్రి ట్రిప్లికేన్లోని ఓ తిను బండారాల షాపుకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నారు.అయితే బిల్లు కట్టకుండానే ఇద్దరూ వెళ్లిపోతుండటంతో షాపు యజమాని ఇదేంటని ప్రశ్నించాడు. బిల్లు కట్టమని కోరాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన ఆ ఇద్దరూ యజమానిపై ఆవేశంతో ఊగిపోయారు.మమ్మల్నే బిల్లు అడుగుతావా అంటూ రెచ్చిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పీఏకి ఫోన్ చేస్తామని... అది మత విద్వేషాలకు దారితీయవచ్చునని బెదిరించారు.
అరెస్ట్ చేసిన పోలీసులు
షాపు యజమాని ఎంతగా బతిమాలినా ఆ ఇద్దరూ వినిపించుకోకపోవడంతో ఇక చేసేది లేక పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. ఆ ఇద్దరు మద్యం మత్తులోనే ఈ రచ్చ చేసినట్లు గుర్తించారు. ఓ పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తులుగా వీరిని గుర్తించారు. అయితే ఆ వివరాలేవి వెల్లడి కాలేదు. షాపులో రచ్చకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్లలోనూ...
ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సాగర్ పటేల్(19),శంకర్(29) అనే ఇద్దరు వ్యక్తులు ఓ రెస్టారెంట్కు నిప్పంటించారు. రెస్టారెంటులో చికెన్ ఐటెమ్స్ లేవని చెప్పడంతో కోపోద్రిక్తులైన ఇద్దరు ఈ దాడికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఈతాహ్లోనూ ఇదే తరహా ఘటన జరిగింది. వేడిగా లేని చపాతీలు పెట్టారన్న కోపంతో ఓ కస్టమర్ రెస్టారెంట్ యజమానిపై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో అతని కాలికి తీవ్ర గాయాలయ్యాయి.