ఆవుల్ని దొంగిలించారు: ఇద్దరు దళిత యువకులకు గుండు కొట్టించారు
లక్నో: ఆవులను దొంగిలించినందుకు ఇద్దరు యువకులకు గుండు కొట్టించిన సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటు చేసుకుంది. యూపీలోని బలియాలో ఈ సంఘటన సోమవారం నాడు జరిగింది.
ఇద్దరు దళిత యువకులు ఆవులను దొంగిలించినందుకు గాను వారికి గుండు కొట్టించి, వీధుల వెంట తిప్పారు. వారి మెడలో ఆవు దొంగలు అని హిందీలో రాసిన ప్లకార్డును పెట్టారు. ఆవులను దొంగిలించినందుకు ఇలా చేసినట్లు పేర్కొన్నారు.
ఆవులను దొంగిలించినందుకు గాను ఉమ, సోను అనే ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఓ ఆలయంలో ఆవులను దొంగిలించిన ఆ ఇద్దరిని కొందరు గ్రామస్తులు చూశారు. దీంతో వారికి గుండు కొట్టించి రోడ్లపై తిప్పారు. వారిద్దరి పైన చేయి కూడా చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది. అవులను దొంగిలించిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆవులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, వారిపై చేయి చేసుకున్న వారి విషయంలోను విచారణ జరుగుతోందని చెప్పారు. వారిని కొట్టిన గ్రామస్తుల పైన చర్యలు తీసుకుంటామన్నారు.