భారత్ బంద్: ఈ రెండు రోజులు బ్యాంకులు పనిచేయవు..?
ఉద్యోగులపై ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు నిరసనగా కేంద్ర ట్రేడ్ యూనియన్లు రెండు రోజుల బంద్కు పిలుపునిచ్చాయి. జనవరి 8,9వ తేదీల్లో బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ను విజయవంతం చేయాలని పలు ఉద్యోగ సంఘాలకు ట్రేడ్ యూనియన్ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. ఇందులో భాగంగా చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు జనవరి 8,9 వతేదీల్లో బంద్కు మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఆ రెండు రోజులు మూతపడే అవకాశం ఉంది.
బంద్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన బ్యాంకింగ్ సంఘాలు
ఇప్పటికే బంద్లో పాల్గొనాల్సిందిగా ఆలిండియా బ్యాకు ఎంప్లాయిస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా సంఘాలు వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు పిలుపునిచ్చాయి. ట్రేడ్ యూనియన్ సంఘాలుINTUC, AITUC, HMS, CITU, AIUTUC, AICCTU, UTUC, TUCC, LPFమరియు SEWAలకు మద్దతు తెలపాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంకింగ్ సంఘాలు బంద్క మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాయి.
మోడీ సర్కార్ విధానాలకు నిరసనగా బంద్
ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు ఉత్పత్తి పనులు కాంట్రాక్టులు ఇచ్చి ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం విస్మరిస్తోందని ధ్వజమెత్తింది సీఐటీయూ. మేకిన్ ఇండియా పేరుతో బడా ప్రైవేటు కంపెనీలకు పనులు అప్పజెప్పి ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల్లోకి మోడీ సర్కార్ నెట్టివేస్తోందని ట్రేడ్ యూనియన్ వర్గాలు ఆరోపించాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ముందు 12 డిమాండ్లు ఉంచాయి ట్రేడ్ యూనియన్ వర్గాలు. ఇప్పటికే పలు కేంద్ర సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఎంప్లాయిస్, ఇన్ష్యూరెన్స్, టెలికాం రంగాలతో పాటు ఇతర రంగాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా తమకు మద్దతు తెలిపాయని ట్రేడ్ యూనియన్ వర్గాలు వెల్లడించాయి. రైతులు కూడా తమ బంద్లో పాల్గొంటారని యూనియన్ వర్గాలు స్పష్టం చేశాయి.
బంద్కు విద్యార్థి సంఘాల మద్దతు
బ్యాంకు ఉద్యోగులు బంద్లో పాల్గొంటే సేవలు జనవరి 8,9 అంటే రెండురోజులు సేవలు నిలిచిపోనున్నాయి. ఒకవేళ బ్యాంకులు బంద్ చేయాల్సి వస్తే కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా బ్యాంకులు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఇక జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలోని విద్యార్థి సంఘాలు కూడా బంద్కు మద్దతు తెలిపాయి. మోడీ సర్కార్ విద్యాసంస్థలకు నిధులు విడుదల చేయడంలో ఉదాసీనతతో వ్యవహరిస్తోందంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. అంతేకాదు నిధుల వినియోగంలో వీసీ అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ మరో గురువు సద్గురుల ఆధ్యాత్మిక సదస్సుల కోసం రూ. 13 లక్షలు ఖర్చు చేసిన యూనివర్శిటీ పెద్దలు... విద్యార్థుల సదుపాయాల కోసం ఎందుకు ఖర్చు చేయడం లేదని విద్యార్థి నాయకులు ప్రశ్నించారు.