బి అలర్ట్: మళ్లీ బ్యాంకుల బంద్.. వరుసగా సమ్మెలు.. బడ్జెట్ రోజునా తెరుచుకోవు.. యూనియన్ల ప్రకటన
రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా జాతీయ బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. ఏటీఎంలపైనా దాని ప్రభావం పడనుంది. విడతలవారీగా చేపట్టనున్న జాతీయ స్థాయి సమ్మెకు సంబందించి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(బ్యాంక్ ఉద్యోగ యూనియన్ల ఉమ్మడి ఫోరం-యూఎఫ్బీయూ) గురువారం కీలక ప్రకటన చేసింది. జీతాల పెంపు, పెన్షన్ల సెటిల్మెంట్, పని ప్రదేశంలో నిబంధనల మార్పు.. తదితర డిమాండ్లపై యాజమాన్యాల(ఆలిండియా బ్యాంక్స్ అసోసియేషన్-ఐబీఏ)తో చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగబోతున్నట్లు యూనియన్లు తెలిపాయి.
ఈ తేదీల్లో బ్యాంకులు పనిచేయవు..
బ్యాంక్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. డిమాండ్లు నెరవేరకుంటే మార్చిలో వరుసగా మూడు రోజులు(11, 12, 13 తేదీల్లో), ఏప్రిల్ 1న కూడా విధులు బహిష్కరిస్తామని ఉద్యోగుల యూనియన్ల ఉమ్మడి ఫోరం తెలిపింది. ఉద్యోగుల డిమాండ్ల పట్ల బ్యాంకుల యాజమాన్యాలు పూర్తి వ్యతిరేకత ప్రదర్శించాయని, తప్పనిసరి పరిస్థితుల్లోనే హక్కుల కోసం సమ్మెకు దిగుతున్నామని యూఎఫ్బీయూ జనరల్ సెక్రటరీ దేబాశిష్ బాబు చౌదరి అన్నారు.
బడ్జెట్ డే ఎఫెక్ట్..
రకరకాల డిమాండ్లతో బ్యాంక్ ఉద్యోగులు ఆందోళనలకు దిగడం కొత్త కానప్పటికీ.. ప్రస్తుతం ఇచ్చిన సమ్మె పిలుపు మాత్రం నేరుగా బడ్జెట్ తో ముడిపడి ఉండటం గమనార్హం. జనవరి 31న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఎకనామిక్ సర్వేను సమర్పించనుంది. ఆ తర్వాతిరోజైన ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. నెలలో మొదటి శనివారం సెలవు అయినప్పటికీ ఫిబ్రవరి 1న బడ్జెట్ డే కావడంతో అన్ని ప్రైవేటు బ్యాంకులు పనిచేయనున్నాయి. స్టాక్ ఎక్సేంజ్ లు కూడా బడ్జెట్ కోసం తెరిచే ఉంటాయి. ఇలాంటి కీలక సమయంలో జాతీయ బ్యాంకులు మాత్రం ఉద్యోగుల సమ్మె కారణంగా మూతపడనున్నాయి.
ఉద్యోగుల డిమాండ్లివే..
కార్మిక సంఘాల పిలుపుమేరకు ఈ నెల 8న జరిగిన భారత్ బంద్ లో బ్యాంక్ ఉద్యోగుల యూనియన్లు కూడా పాల్గొనడం తెలిసిందే. రాబోయే రోజుల్లో చేపట్టబోయే సమ్మెలకు సంబంధించి వారు స్పష్టమైన డిమాండ్లను ప్రభుత్వముందుంచారు. వాటిలో జీతాల పెంపు, కొత్త పెన్షన్ విధానం రద్దు, పని గంటల తగ్గింపు, కేంద్ర ఉద్యోగుల మాదిరిగా వారానికి 5 రోజుల పనిదినాలు తదితర అంశాలున్నాయి.