ఆర్టికల్ 370 రద్దుకు ఏడాది: కాశ్మీర్లో రెండ్రోజులపాటు కర్ఫ్యూ
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దయిపోయి ఆగస్టు 5 నాటికి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆగస్టు 5ను బ్లాక్ డేగా పాటించాలని పీడీపీ, వేర్పాటువాదులు పిలుపునిచ్చారు.
అంతేగాక, జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కూడా దాడులకు తెగబడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సున్నిత ప్రాంతంలో అల్లర్లు జరిగేందుకు అవకాశమున్నందున ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటోంది.
మంగళ, బుధవారాల్లో శ్రీనగర్లో కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించింది. మరోవైపు కరోనావైరస్ నివారణ చర్యల్లో భాగంగా అమల్లో ఉన్న నిబంధనలను ఆగస్టు 5 నుంచి 8వ తేదీ వరకు పొడిగించింది. ప్రజలకు అత్యవసరాల నిమిత్తం మాత్రమే బయటికి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
గత ఏడాది ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు సమయంలోనూ ఇలాంటి కర్ఫ్యూనే జమ్మూకాశ్మీర్లో విధించారు. లడఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా, జమ్మూకాశ్మీర్ను అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా విభజించారు. ఆందోళనలు నెలకొనే పరిస్థితులు ఉండటంతో మాజీ సీఎం మెహబూబా ముఫ్తీతోపాటు పలువురు నేతలను నిర్బంధంలోనే ఉంచారు. మార్చి 11న మరో మాజీ సీఎం ఒబర్ అబ్దుల్లా నిర్బంధం నుంచి విడుదలయ్యారు. దాదాపు 8 నెలలు ఆయన నిర్బంధంలోనే ఉన్నారు. ఈ ప్రాంతంలో మరోసారి గత ఏడాది ఆగస్టు 5నాటి పరిస్థితులు తీసుకొస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.