ఇద్దరు ఉపముఖ్యమంత్రులు! అధిష్ఠానంతో చర్చల తర్వాతే నిర్ణయం అంటున్న యెడ్డీ !!
బెంగళూరు/హైదరాబాద్ : ఇక కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు కూలిపోవడంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో 14 నెలల ఆపరేషన్ యజ్ఞానికి తగిన ఫలితం పొందిన బి.ఎస్.యడ్యూరప్పకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొనే అవకాశం అందివచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకుగానూ ఇవాళ భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష సమావేశం జరిగింది.
రాబోయే బీజేపి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా యడ్యూరప్పతోపాటు.. మరో ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించే అంశాలపై చర్చించారు. ఈ ప్రతిపాదన ప్రతిని గవర్నర్ వజుభాయ్ వాలాకు యడ్యూరప్ప అందించారు. అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం పార్టీ అధిష్ఠానంతో చర్చించేందుకు యడ్డీ దిల్లీ బయల్దేరి వెళ్లారు. అధిష్ఠానం ఆదేశిస్తే ఈ రోజే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బీజేపి కి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో సర్కారు ఏర్పాటుకు జాప్యం చేయకూడదని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.
ఐతే బల పరీక్ష వరకు బీజేపి నేతలందరూ ఏకతాటి మీద ఉన్నప్పటికీ అంతర్గతంగా కుమ్ములాటలున్నాయి. ఈ నేపథ్యంలో ఎంత వీలైతే అంత త్వరగా అధికార కుర్చీలో కూర్చోవాలని కమలనాథులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్నయితే గద్దె దించారు గానీ..ఇప్పుడు స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో బీజేపి నేతలకు భయం పట్టుకుంది.
బల పరీక్షకు ముందు 'ఆపరేషన్ రివర్స్' కు సిద్ధమైనట్లు కుమారస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే. అసలే ప్రభుత్వాన్ని కోల్పోయిన బాధలో ఉన్న కుమార ఆపరేషన్ రివర్స్ను అమలు చేసినా ఆశ్యర్యపోనవరం లేదు. ఈనేపథ్యంలో ఎలాగైనా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపి నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అది గవర్నర్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది.