ప్రాణాలు నిలిపే అంబులెన్సే.. ఇద్దరి ఉసురు తీసింది: పది అడుగులు గాల్లోకి లేచిన బైక్..!
బెంగళూరు: ఏదైనా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటే.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, సకాలంలో చికిత్స అందించడానికి ఉపయోగే ఏకైక సాధనం.. అంబులెన్స్. అలాంటి అంబులెన్సే ఇద్దరు యువకుల ప్రాణాలను హరించి వేసింది. ఈ విషాదకర ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్తోన్న సమయంలో అంబులెన్స్ ఎదురుగా వచ్చిన ఓ బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తోన్న ఇద్దరు యువకులూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
మృతుల పేర్లు ఇబ్రహీం ఖలీల్, మన్సూర్. వారిద్దరూ సేల్స్మెన్లుగా పని చేస్తున్నారు. నాగవారలోని ఓ వర్కింగ్ మెన్స్ హాస్టల్లో నివసిస్తున్నారు. తమ విధులను ముగించుకుని బెంగళూరు పాత విమానాశ్రయం ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా బైక్పై నాగవారకు బయలుదేరారు. మార్గమధ్యలో ఇన్నర్ రింగ్రోడ్డు వద్ద రాంగ్రూట్లో వచ్చిన ఓ అంబులెన్స్ వారిని అతివేగంగా ఢీ కొట్టింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉందా అంబులెన్స్.
అలాంటి స్థితిలో అంబులెన్స్కు రాంగ్రూట్లో వెళ్లడానికి అనుమతి ఉన్న విషయం తెలిసిందే. అతివేగంగా వచ్చిన అంబులెన్స్ అంతే వేగంతో బైక్ను ఎదురుగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇబ్రహీం ఖలీల్, మన్సూర్ బైక్తో సహా సుమారు పది అడుగుల మేర గాల్లోకి ఎగిరి డివైడర్పై పడ్డారు. వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తపుమడుగులో ఉన్న వారిని వేరే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారు మరణించారు.
సమాచారం అందుకున్న వెంటనే అశోక్ నగర్ పోలీసులు సంఘటాన స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ వాహనాన్ని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్ 304 కింద డ్రైవర్పై కేసు నమోదు చేశారు. కాగా- చేతికి అంది వచ్చిన తమ కుమారులు అర్ధాంతరంగా మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఖలీల్.. ఉద్యోగం కోసం గత నవంబర్లోనే తన స్వగ్రామం నుంచి బెంగళూరుకు వచ్చాడు. ఓ ప్రైవేటు సంస్థలో సేల్స్మెన్గా చేరాడు. ఉద్యోగంలో చేరిన కొద్దిరోజులకే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.