సిద్దరామయ్యకు రెబల్ ఎమ్మెల్యేల ఫోన్, కర్ణాటక సీఎంకు షాక్, టచ్ లో ఉన్నారు, అసెంబ్లీలో !
బెంగళూరు: ముంబైలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీఎల్ పీ నాయకుడు సిద్దరామయ్యకు ఫోన్ చేశారని వెలుగు చూడటటంతో బీజేపీ నాయకులు హడలిపోయారు. శనివారం బెంగళూరులో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ తనకు ముంబై నుంచి రెబల్ ఎమ్మెల్యేలు ఫోన్ చేసి మాట్లాడారని, టచ్ లో ఉన్నారని దృవీకరించారు. అయితే ముంబై నుంచి ఫోన్ చేసిన ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేల పేర్లు చెప్పడానికి మాజీ సీఎం సిద్దరామయ్య నిరాకరించారు.
సీఎం యడియూరప్పకు షాక్
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సోమవారం శాసన సభలో అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టడానికి సిద్దం అయ్యారు. అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెడుతున్న సమయంలో రెబల్ ఎమ్మెల్యేలు శాసన సభకు హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే యడియూరప్ప ఆశలు అవిరి అయ్యే అవకాశం ఉంది. ముంబైలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలకు నచ్చ చెప్పడానికి మాజీ సీఎం సిద్దరామయ్య ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
ఫలించిన అనర్హత వేటు
కుమారస్వామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల మీద ఆ పార్టీ పెద్దలు అనర్హత వేటు ప్రయోగించారు. ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడటంతో ఆందోళనతో రెబల్ ఎమ్మెల్యేలు సిద్దరామయ్యకు ఫోన్ చేసి ఉంటారని సమాచారం.
ఆ ఎమ్మెల్యేలు కాదు
మాజీ సీఎం సిద్దరామయ్యకు ఫోన్ చేసిన రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటు విషయంపై చర్చించారని సమాచారం. అందు వలన సిద్దరామయ్యకు ఫోన్ చేసిన రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటు పడిన వారు కాదని స్పష్టంగా అర్థం అవుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి రమేష్ జారకిహోళి, ఎమ్మెల్యే మహేష్ కుమటళ్ళి, స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే ఆర్. శంకర్ ల మీద స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు.
ఇద్దరు టచ్ లో ఉన్నారు
సిద్దరామయ్యకు ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కర్ణాటక మాజీ హోం మంత్రి ఎంబీ. పాటిల్ శనివారం మీడియాకు చెప్పారు. మిగిలిన రెబల్ ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా సిద్దరామయ్య రిసీవ్ చెయ్యడం లేదని మాజీ హోం మంత్రి ఎంబీ. పాటిల్ అన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడటంతో మిగిలిన ఎమ్మెల్యేలకు అనర్హత వేటు పడుతోందని భయం పట్టుకుందని, అందుకే తమ మనసు మార్చుకుంటామని సిద్దరామయ్యకు ఫోన్ చేసి ఉంటారని సమాచారం.
రెబల్ ఎమ్మెల్యేల చేతిలో యడియూరప్ప భవిష్యత్తు
ఈ నెల 29వ తేదీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టడానికి తాను సిద్దంగా ఉన్నానని సీఎం యడియూరప్ప స్పష్టం చేశారు. అయితే ముంబైలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేల నిర్ణయం మీద సీఎం యడియూరప్ప భవిష్యత్తు ఆదారపడి ఉంటుంది. శాసన సభకు రెబల్ ఎమ్మెల్యేలు హాజరై సీఎం యడియూరప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే మొదటికే మోసం వస్తోంది.