ప్రియురాలితో కలిసి ఎంఎన్సి ఉద్యోగి దొంగతనాలు
బెంగళూరు: బహుళజాతి సంస్థ(ఎంఎన్సి)ల్లో మంచి ఉద్యోగం చేసుకుంటున్న ఓ జంట విలాసాలకు అలవాటు పడింది. నెలకు వేలాది రూపాయల్లో జీతం చేతికందుతున్నా సంతృప్తి చెందని వారు దొంగలుగా మారారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కపెడుతున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. దేవసంద్రకు చెందిన కిశోర్ కుమార్(24) ఓ బహుళ జాతి సంస్థలో హెచ్ఆర్గా విధులు నిర్వహిస్తున్నాడు. పాండవపుర తాలూకా బీరశెట్టిహళ్లికి చెందిన కవిత(22) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తోంది.
కాగా, స్నేహితులైన వీరిద్దరూ సారక్కి మెయిన్ రోడ్డులో ఉన్న విమల్ జువెల్లర్స్ షాపులోకి సోమవారం మధ్యాహ్నం సీనియర్ పోలీస్ అధికారుల వేషంలో వెళ్లారు. ఆభరణాలు కొనుగోలు చేసే నెపంతో రూ. 40వేల విలువ చేసే 16 గ్రాముల బంగారు గొలుసు అపహరించి ఉడాయించారు.
ఆ విషయాన్ని గమనించిన షాపు యజమాని జేపీనగర్ పోలీసులను ఆశ్రయించారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణలో భాగంగా సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించి నిందితుల ఆనవాళ్లను గుర్తించారు.
డిసిపి లోకేశ్ కుమార్, ఏసిపి కాంతరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు 12గంటలపాటు గాలించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. బంగారు గొలుసు, నకిలీ పోలీస్ గుర్తింపు కార్డు, పోలీస్ అధికారి యూనిఫాంలో ఉన్న వారి ఫొటోలు, సెల్ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.