వీడియో వైరల్ : ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు..చెలరేగిన మంటలు
బెర్లిన్ : జర్మనీ గగనతలంలో రెండు యుద్ధ విమానాలు ఢీకొన్నాయి. జర్మనీ ఎయిర్ఫోర్స్కు చెందిన ఈ యుద్ధ విమానాలు ఢీకొన్న తర్వాత అందులోని పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ రెండు యుద్ధ విమానాలు ఓ మిషన్పై ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రెండు యుద్ధ విమానాలు ఢీకొనడం మూడో యుద్ధ విమానంలోని పైలట్లు గమనించారు.
భారత కాలమాన ప్రకారం రెండు యుద్ధ విమానాలు సాయంత్రం 5:30 గంటల సమయంలో ఢీకొన్నాయి. ఈ విషయాన్ని స్థానిక రేడియో స్టేషన్ ఆస్టీవెల్లీ ప్రకటన చేసింది.జర్మనీ రాజధాని బెర్లిన్కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మెరిట్జ్ సరస్సు వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రేడియో స్టేషన్ ప్రకటించింది. ఢీకొనగానే రెండు యుద్ధ విమానాల్లోని పైలట్లు పారాష్యూట్ సహాయంతో క్షేమంగా భూమిపైకి చేరుకున్నారని మూడో యుద్ధ విమానంలోని పైలట్ సమాచారాన్ని అందించినట్లు అధికారులు ట్వీట్ చేశారు. యుద్ధ విమానాలు ఢీకొనగానే వాటి నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఆ తర్వాత ఆ ప్రాంతంను దట్టమైన పొగ కమ్మేసినట్లు అధికారులు ధృవీకరించడంతో పాటు వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Reports that two Eurofighter jets touched each other and crashed in Northern Germany. Apparently the pilots ejected safely, but wildfires have erupted at the crash sites.
— Ragnar Weilandt (@RagnarWeilandt) June 24, 2019
pic.twitter.com/mttc8gHZMT
రెండు యుద్ధ విమానాలు ఢీకొట్టడం ద్వారా చెలరేగిన మంటలు కొంత అటవీ ప్రాంతానికి వ్యాపించాయని అధికారులు తెలిపారు. అయితే జనావాసం లేని ప్రాంతాన్ని ఈ మంటలు దహించి వేసి ఉంటాయన్న అనుమానం అధికారులు వ్యక్తం చేశారు. విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డ పైలట్లు ఎక్కడ ఉన్నారో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారు క్షేమంగా కిందకు దిగినట్లు మాత్రం సమాచారం ఉందని అయితే ఎక్కడ దిగారో అనేదానిపై స్పష్టత లేదని చెప్పిన అధికారులు వారి జాడకోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.