మోసానికీ ఆధార్ కార్డే ఆధారం: రూ.3 కోట్ల రూపాయలను ఊదేశారు!
లక్నో: దేశంలో అన్ని సంక్షేమ పథకాలు, బ్యాంకు అకౌంట్లు సహా దాదాపు అన్ని అవసరాలకూ ఆధార్ కార్డును లింక్ చేసినట్టే.. మోసానికి కూడా దాన్నే ఆధారంగా చేసుకున్నారు ఇద్దరు ఘరానా దొంగలు. ఆధార్ కార్డులను ఫోర్జరీ చేసి మూడు కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడ్డారు. చివరికి పోలీసుల చేతికి చిక్కారు. కటకటాల వెనక్కి వెళ్లారు. ఫోర్జరీ చేసిన ఆధార్ కార్డులతో నకిలీ క్రెడిట్ కార్డులను సృష్టించడం, వాటి ద్వారా నిందితులు షాపింగ్ చేయడం అలవాటుగా చేసుకున్నారు. ఇలా ఏకంగా మూడు కోట్ల రూపాయల మేర విలువ చేసే షాపింగ్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.
సందీప్ కుమార్, సందీప్ బేణివాల్ అనే ఇద్దరు బీటెక్ విద్యార్థులు నిందితులుగా తేలింది. అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ యాజమాన్యం చేసిన ఫిర్యాదు మేరకు ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 20 పోలీసులు రంగంలోకి దిగారు. కూపీ లాగగా.. ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
నిందితుల నుంచి వివిధ బ్యాంకులకు చెందిన 29 కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో అయిదు అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ సహా వేర్వేరు బ్యాంకులకు చెందిన ఆరు ఏటీఎం కార్డులు, 10 నకిలీ ఆధార్ కార్డులు, ఏడు పాన్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఓ కారు, రూ.20 వేల నగదు కూడా వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొంత మంది హస్తం కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు.