మధ్యాకాశంలో ఇండిగో విమానాలకు తప్పిన పెనుప్రమాదం
రెండు విమానాలు ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డాయి. ఆ సమయంలో రెండు విమానాల్లో కలిపి మొత్తం 328 మంది ప్రయాణికులున్నారు. మంగళవారం చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇండిగో ఎయిర్ లైన్స్కు చెందిన రెండు విమానాలు బెంగళూరు నుంచి బయలుదేరాయి. ఒకటి 6E-779 విమానం కోయంబత్తూర్ నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్కు వెళుతోంది. మరో విమానం 6E-6505 బెంగళూరు నుంచి కొచ్చిన్ వెళుతోంది.
రెండు విమానాలు మధ్యాకాశంలో ఎదురెదురుగా వచ్చాయి. అదే సమయంలో కాక్పిట్లో అలారం మోగడంతో ఘోర ప్రమాదం తప్పింది. గంటకు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో రెండు విమానాలు దూసుకొచ్చాయి. ఇక ప్రమాదం జరుగుతుంది అనగా అప్పటికే రెండు విమానాలు కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి హైదరాబాదుకు వెళుతున్న విమానంలోని పైలట్కు ముందుగా సంకేతాలు అందాయి. విమానంను 36వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాల్సిందిగా ఆదేశాలు అందాయి. కొచ్చిన్కు వెళుతున్న మరో విమాన పైలెట్కు ఆ విమానంను 28వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాల్సిందిగా సంకేతాలు అందాయి.
అయితే ఒకానొక దశలో హైదరాబాద్ విమానం 27వేల 300 అడుగుల ఎత్తుకు చేరుకోగా... కొచ్చిన్ విమానం అదే సమయానికి 27వేల 500 అడుగుల ఎత్తులో ఉంది. అంటే రెండిటి మధ్య తేడా 200 అడుగులు మాత్రమే ఉన్నింది. సంకేతాల్లో ఏం కొంచెం తేడా జరిగినా 328 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లోనే కలిసేవి.
ఈ ఘటనపై పౌరవిమానాయాన శాఖ విచారణకు ఆదేశించింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు విచారణ ప్రారంభించింది. సాధారణంగా మధ్యాకాశంలో ప్రమాదాలు నివారణ కోసం అలర్ట్లు వినిపిస్తాయి. రెండు విమానాలు ఎదురెదురుగా వస్తున్న సమయంలో ఒక విమాన పైలెట్కు క్లైంబ్ అనే సంకేతాలు, మరో విమన పైలెట్కు డిసెండ్ అనే సంకేతాలు వెలువడుతాయి.
దీని ప్రకారం పైలెట్లు అలర్ట్ అయి తమకు అందిన ఆదేశాల మేరకు విమానాలను నడుపుతారు. అయితే ఈ సంకేతాలు అందడంలో ఏమాత్రం సమాచారం తప్పుగా దొర్లినా ఇక అంతే సంగతులు.