కర్నాటకలో ఉగ్రవాదుల భారీ కుట్ర...పేలని బాంబులను నిర్వీర్యం చేసిన ఎన్ఐఏ
బెంగళూరు: గార్డెన్ సిటీపై ఉగ్రవాదులు కన్నేశారా..? ఐటీ సిటీని ధ్వంసం చేయాలని కుట్ర పన్నారా.. బెంగళూరులో అలజడి సృష్టించాలని ఉగ్రమూకలు భావిస్తున్నాయా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఈ సమాచారం కూడా ఇచ్చింది అరెస్టయిన మిలిటెంట్ కావడం విశేషం. బెంగళూరు సరిహద్దులోని దొడ్డబళ్లాపూర్లో నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ హబీబుర్ రెహ్మాన్ను అరెస్టు చేసింది. రెహ్మాన్ను విచారణ చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెహ్మాన్ జమాత్ ఉల్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన ఉగ్రవాదిగా పోలీసులు గుర్తించారు.
హబీబుర్ రెహ్మాన్ ఇచ్చిన సమాచారంతో కర్నాటకలోని రామనగర్ జిల్లాలోని టిపునగర్లో పోలీసులు సోదాలు చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో వారు రెండు పేలని బాంబులను కనుగొన్నారు. వెంటనే బాంబు స్క్వాడ్ సిబ్బంది వాటిని నిర్వీర్యం చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పలు చోట్ల భారీ కుట్రలకు ఇదే సంస్థకు చెందిన ఉగ్రవాదులు స్కెచ్గీసి ఉంటారనే అనుమానం పోలీసులు వ్యక్తం చేశారు. ఇక రామనగరం జిల్లాను మొత్తం ఎన్ఐఏ అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో జల్లెడ పడుతున్నారు.
బెంగాల్లోని బురద్వాన్ బీహార్లోని బోద్గయా పేలుళ్ల కేసులో రెహ్మాన్ నిందితుడుగా ఉన్నాడు. ఈ రెండు పేలుళ్లలో పాల్గొన్న 8 మందిలో ఒకడు రెహ్మాన్. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టుచేశారు. రెహ్మాన్ నాలుగోవాడు. రెండేళ్ల క్రితం ఇదే రామనగరం నుంచి మరో ఉగ్రవాది మునీర్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మునీర్ రెహ్మాన్ల మధ్య సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తున్నట్లు సమాచారం. రెహ్మాన్ను అరెస్టు చేసి ఎన్ఐఏ స్థానిక మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా అతన్ని రిమాండ్కు పంపింది. ప్రస్తుతం రెహ్మాన్ను విచారణ కోసం కోల్కతా ఎన్ఐఏ తీసుకెళ్లింది.