బెంగళూరు శివార్లలో ఉగ్రవాది అరెస్టు: 8 బాంబులు, నాటు బాంబులు సీజ్, ఎన్ఐఏ అధికారులు !
బెంగళూరు: బెంగళూరు గ్రామీణ జిల్లా దోడ్డబళ్ళాపురలో మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేసిన ఉగ్రవాది హబీబుర్ రెహమాన్ ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం బెంగళూరు నగర శివార్లలోని రామనగరలో రెండు సజీవ నాటు బాంబులను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రామనగరలోని టప్పునగర్ లోని ప్రధాన డ్రైనేజ్ (రాజ కాలువ)లో భద్రపరిచిన రెండు నాటు బాంబులను గుర్తించిన ఎన్ఐఏ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. మొత్తం 8 బాంబులు భద్రపరిచానని ఉగ్రవాది హబీబుర్ రెహమాన్ ఎన్ఐఏ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
అయితే బుధవారం మాత్రం అతను రెండు నాటు బాంబులను మాత్రమే అధికారులకు చూపించాడు. మిగిలిన ఆరు నాటు బాంబుల కోసం ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ అధికారులు, స్థానిక పోలీసులు గాలిస్తున్నారు. ఒక సంవత్సరం క్రితం రాజ కాలువ (ప్రధాన డ్రైనేజ్)లో రెండు నాటు బాంబులు భద్రపరిచానని ఉగ్రవాది హబీబుర్ రెహమాన్ అధికారుల విచారణలో అంగీకరించాడు.
2018 ఆగస్టు నెలలో రామనగర్ లో మునీర్ షేక్ అనే ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. మునీర్, మంగళవారం అరెస్టు అయిన హబీబుర్ రెహమాన్ స్నేహితులు అని అధికారులు గుర్తించారు. మునీర్ ను అరెస్టు చేసిన సమయంలో అతని భార్య షాక్ కు గురైయ్యే వాస్తవాలు బయటపెట్టింది.
దోడ్డబళ్ళాపురలోని మసీదు సమీపంలో అద్దె ఇంటిలో హబీబుర్ రెహమాన్ నివాసం ఉంటున్నాడు. ఇతను బాంగ్లాకు చెందిన ఉగ్రవాద సంస్థలో పని చేస్తున్నాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఉగ్రవాది హబీబుర్ రెహమాన్ మీద పశ్చిమ బెంగాల్ లో కేసులు నమోదైనాయి.
2014 అక్టోబర్ 2 లో పశ్చిమ బెంగాల్ లోని బుద్దాన్ జిల్లా ఖగ్రాగడ ప్రాంతంలో హసన్ చౌధరి అనే వ్యక్తి ఇంటిలో నాటు బాంబులు తయారు చేస్తున్న సమయంలో అవి పేలిపోయాయి. నాటు బాంబులు పేలిపోవడంతో ఇద్దరు అమాయకులు బలైనారు.
నాటు బాంబులు పేలిపోయిన తరువాత ఉగ్రవాది హబీబుర్ రెహమాన్ తప్పించుకుని పరారైనాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలించి సీఐడీ అధికారులకు అప్పగించారు. సీఐడీ అధికారులు చివరికి కేసు ఎన్ఐఏ అధికారులకు అప్పగించారు. ఎన్ఐఏ అధిదకారులు రెహమాన్ కోసం గాలిస్తూ కర్ణాటక చేరుకున్నారు.