మైసూరు రాజకుటుంబంలో విషాదం: రాజమాత, ఆమె మరదలు కన్నుమూత, వేడుకలు రద్దు
బెంగళూరు: మైసూరు మహారాజు కుటుంబంలో ఒకే సమయంలో రెండు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం ఒకేరోజున ఇద్దరు కుటుంబ పెద్దలు కన్నుమూశారు. శుక్రవారం ఉదయం రాజమాత ప్రమోదాదేవి తల్లి పుట్టచిన్నమ్మణ్ణి (98) కన్నుమూయగా, మైసూరు చివరి మహారాజు జయచామరాజ ఒడెయరు కుమార్తె (ప్రమోదాదేవి వదిన మరదలు) విశాలక్షి దేవి (58) సాయంత్రం సమయంలో తుదిశ్వాస విడిచారు.
రాజమాత చిన్నమణ్ణి కన్నుమూత
రాజమాత ప్రమోదాదేవి తల్లి పుట్ట చిన్నమ్మణ్ణి (98) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆమె ఇక్కడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వయోభారం కారణంగానే ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారం రోజులుగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పుట్ట చిన్నమ్మణ్ణి మృతితో ప్యాలెస్లో నిర్వహించాల్సిన విజయదశమి వేడుకల్ని రద్దు చేశారు. ముందు నిర్ణయించిన ప్రకారం ప్యాలెస్లో కుస్తీ పోటీల్ని నిర్వహించాల్సి ఉంది. వీటిని రద్దు చేసినట్లు రాజవంశీయులు తెలిపారు.
వేడుకలు రద్దు
రాజవంశీయుడు శ్రీకంఠదత్త నరసింహరాజు సోదరి విశాలాక్షి తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం అందగానే రాజమాత ప్రమోదాదేవి ఆయుధ పూజ పండుగను రద్దు చేసుకుని గురువారమే బెంగళూరు పయనమయ్యారు. శుక్రవారం తల్లి మృతి చెందిన సమయంలో ఆమె బెంగళూరులోనే ఉన్నట్లు సన్నిహితులు తెలిపారు. మరణవార్త వినగానే ఆమె బెంగళూరు నుంచి హుటాహుటిన మైసూరుకు చేరుకున్నారు.
సీఎం సంతాపం..
పుట్టచిన్నమ్మణ్ణి తుదిశ్వాస వదిలారనే సమాచారం తెలియగానే ప్యాలెస్ మండలి సంచాలకుడు సుబ్రహ్మణ్య తదితరులు ఆసుపత్రికి చేరుకున్నారు. భౌతికకాయాన్ని అంబులెన్స్లో సమ్మర్ ప్యాలెస్కు తరలించారు. అక్కడ కుటుంబ సభ్యుల దర్శనానికి అవకాశం కల్పించారు. పర్యాటకశాఖ మంత్రి మహేష్ భౌతికకాయాన్ని సందర్శించారు. పుట్టచిన్నమ్మణ్ణి మృతి పట్ల ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
విశాలక్ష్మి మరణంతో మరింత విషాదం
మైసూరు రాజవంశీయుడు దివంగత శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడెయరు సోదరి విశాలాక్షి (58) కన్నుమూశారు. శుక్రవారం సాయంత్రం బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజమాత ప్రమోదాదేవికి స్వయానా ఆమె మరదలు. మైసూరు చివరి మహారాజు జయచామరాజ ఒడెయరు కుమార్తె కూడా. శుక్రవారం ఉదయమే ప్రమోదాదేవికి మాతృవియోగం కల్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు విశాలాక్షి మరణంతో ఒడెయరు కుటుంబంలో ఒకేరోజున ఇద్దరు పెద్దలు కన్నుమూయడంతో తీవ్ర విషాదం నెలకొంది.