గ్యాంగ్ రేప్, హత్య: ఇద్దరు యువకులకు ఉరి శిక్ష
అగర్తాల: కామంతో కళ్లు మూసుకుపోయి బాలికను కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన ఇద్దరు నిందితులకు న్యాయస్థానం తగిన శిక్ష వేసింది. నిందితులు ఇద్దరిని ఉరి తియ్యాలని త్రిపురలోని న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.
ఉత్తర త్రిపురలోని కమల్ పూర్ అడిషన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అరిందమ్ పాల్ ఈ మేరకు తీర్పు చెప్పారు. రషీద త్రిపుర (25), జానీ త్రిపుర (20) అనే ఇద్దరికి ఉరి శిక్షతో పాటు రూ. 20 వేల చోప్పున జరిమానా విధించారు.
దలాలై జిల్లా ఎస్పీ బిజోయ్ దెబ్రమ్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వీరిద్దరు గిరిజనులు. వీరు నివాసం ఉంటున్న ప్రాంతంలో 12 సంవత్సరాల బాలిక ఉంటున్నది. 2014 ఫిబ్రవరి 7 వ తేదీన ఆ బాలికను వీరిద్దరు కిడ్నాప్ చేశారు.
తరువాత సమీపంలోని దట్టమైన అటవి ప్రాంతంలోకి తీసుకు వెళ్లి బాలిక మీద సామూహిక అత్యాచారం చేశారు. బాలిక విషయం బయటకు చెబుతుందని భయపడి ఆమెను అతి దారుణంగా చంపేశారు. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది.
కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న రషీద త్రిపుర, జానీ త్రిపురలను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా అసలు విషయం వెలుగు చూసింది. నిందితులు నేరం చేసినట్లు అంగీకరించారని పోలీసు అధికారులు తెలిపారు.