ఏటీఎం పగులగొట్టకుండా, పాస్కోడ్ ఉపయోగించి రూ.26 లక్షలు దోచుకెళ్లారు
న్యూఢిల్లీ: ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రయివేటు బ్యాంకు ఏటీఎం నుంచి ఎంతో తెలివిగా రూ.26 లక్షలు దోచుకెళ్లారు. ఏటీఎం పగులగొట్టకుండా పాస్కోడ్ ఉపయోగించి వారు ఈ దొంగతనం చేయడం గమనార్హం.
ఈ సంఘటన ఢిల్లీలోని సీలాంపూర్ ప్రాంతంలో జరిగింది. ఏటీఎం నుంచి ఇలా డబ్బులు పోవడం ఈ జిల్లాలో గత ఎనిమిది నెలల్లో ఇది మూడోసారి. ఈ దొంగతనం విషయాన్ని శనివారం రాత్రి గుర్తించారు. ఏటీఎం పని చేయడం లేదని ఓ కస్టమర్ ఫిర్యాదు చేశారు. అప్పుడు బ్యాంకు అధికారులకు ఏం జరిగిందో తెలిసింది.
దొంగతనం ఎలా జరిగిందో తెలుసుకొని పోలీసులు, బ్యాంకు అధికారులు విస్తుపోయారు. ఏటీఎం సెంటర్లోకి వచ్చి క్యాష్ పెట్టిన బాక్స్కు ఉన్న పాస్వార్డ్ ద్వారా దొంగలు డబ్బును దోచుకున్నారు. ఆ పాస్వార్డ్ ద్వారా బాక్స్ను తెరిచి అందులో ఉన్న దాదాపు 26 లక్షలకు పైగా నగదును తీసుకెళ్లారు. పోలీసులు విచారణ చేపట్టగా పాస్వార్డ్ తెలియడం వల్లే దొంగతనం జరిగిందని ప్రాథమిక నిర్ధారించారు.
ఇందులో బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం ఉందేమోనని అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేపట్టారు. ఏటీఎంలో నగదు నింపే ఉద్యోగుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఏటీఎంలో క్యాష్బాక్స్ పాస్వార్డ్ కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఇది బయట వ్యక్తులకు తెలిసే అవకాశం ఉండదని చెబుతున్నారు.