తప్పు చేశారు...వేటు వేశారు: అందుకే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై ఈ ఆరోపణలా..?
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై అఫిడవిట్ దాఖలు చేసిన వారిలో ఇద్దరు అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిన వారే అని తెలుస్తోంది. ఈ మాజీ ఉద్యోగులపై ఫిబ్రవరిలో జస్టిస్ రంజన్ గొగోయ్ వేటు వేశారు. చండీగడ్కు చెందిన అడ్వకేట్ ఉత్సవ్ సింగ్ బెయిన్స్ అఫిడవిట్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ గొగోయ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కావాలనే ఇద్దరు కోర్టు మాజీ ఉద్యోగులు ఆరోపణలు చేస్తున్నారని అఫిడవిట్లో పేర్కొన్నారు.
ఎవరీ తపన్ చక్రబర్తి, మానవ్ శర్మ..?
తపన్ చక్రబర్తి, మానవ్ శర్మ అనే ఇద్దరు మాజీ సుప్రీంకోర్టు ఉద్యోగులపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వేటు వేశారు. కోర్టు ధిక్కారణ కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించగా వీరుమాత్రం వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన పనిలేదంటూ కోర్టు ఆర్డరును తారుమారు చేసి పంపారు. ఇది గుర్తించిన గొగోయ్ వారిపై వేటు వేయడం జరిగింది. ఆ తర్వాత తపన్ చక్రవర్తి, మానవ్ శర్మలపై చీటింగ్ ఫోర్జరీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది. సోమవారం వారు పాటియాలా హౌజ్ కోర్టుకు వారు హాజరుకావాల్సి ఉంది.
అనిల్ అంబానీ ఆర్డర్ కాపీని తారుమారు చేశారు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వేటు వేసిన మానవ్ శర్మ కోర్టు మాస్టర్ కాగా.. చక్రబర్తి అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పనిచేశారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ ఓ టెలికాం కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలన్న న్యాయస్థానం తీర్పును వీరు తారుమారు చేసి సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపర్చారు. అయితే ఎరిక్సన్ తరపున వాదిస్తున్న న్యాయవాది దుష్యంత్ దవే వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తప్పుడు కాపీని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఆ తర్వాత మూడురోజులకు ఈ తీర్పు కాపీని ఆన్లైన్లో సవరించారు. దీనిపై విచారణకు ఆదేశించారు జస్టిస్ నారిమాన్.
తప్పుచేశారని తేలడంతో సీజే వేటువేశారు
విచారణ జరిపిన సభ్యులు మానవ్ శర్మ, తపన్ చక్రబర్తిలు కావాలనే తీర్పు కాపీని తారుమారు చేశారని నివేదిక ఇవ్వడంతో చీఫ్ జస్టిస్ గొగోయ్ వారిపై వేటు వేశారు. దీంతో వారిపై కేసు నమోదే చేసి అరెస్టు చేయడం జరిగింది. ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం వారు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అంతకుముందు వీరిద్దరూ ట్రయల్ కోర్టులో బెయిల్కు దరఖాస్తు చేసుకోగా బెయిల్ తిరస్కరించింది న్యాయస్థానం.