దారుణం: దొంగతనం చేశారని స్తంభానికి కట్టేసి చితకబాదారు
గజియాబాద్: ఉత్తర్ప్రదేశ్ దారుణాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. అక్కడి ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే గజియాబాద్లోని కుషాల్ కాలనీలో చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు దొంగతనంకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇద్దరిని కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. బాధితులను ఆసిఫ్, ఇక్బాల్గా పోలీసులు గుర్తించారు. కరెంటు స్తంభానికి కట్టేసి బెల్టులతో చితకబాదారు. అంతేకాదు ముఖం పై పిడిగుద్దులు, కాళ్లతో కూడా కొట్టారు.
స్థానికులు దాడి చేయడంతో ఆ ఇద్దరు బాధితులు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు ధీరజ్ త్రిపాఠి, దివ్యాన్ష్ రాథోర్ అని ఇద్దరిని అరెస్టు చేశారు. దాడి దృశ్యాలను అక్కడి స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్గా మారింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ ఘటన తమ దృష్టికొచ్చిన తర్వాత సంబంధిత వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే స్థానికంగా నివాసముంటున్న రాకేష్ మిశ్రా మరియు రియాజ్లు బాధితులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉదయం 3 గంటల ప్రాంతంలో తమ నివాసాల్లోకి జొరబడి దొంగతనం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఆసిఫ్, ఇక్బాల్పై దొంగతనం చేశారనే ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పిన పోలీసులు రెండు కేసులను విచారణ చేస్తున్నామని వెల్లడించారు. ఇద్దరు స్థానికలు ఇళ్లలో డబ్బు, మొబైల్ ఫోన్లు దొంగతనం చేశారని పారిపోతున్న సమయంలో మిశ్రా,రియాజ్ కుటుంబాలు గట్టిగా కేకలు వేయడంతో ఓ ఇంటి పైకి పరిగెత్తి అక్కడ దాక్కున్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరిని కిందకు తీసుకొచ్చి స్థంభానికి కట్టేసి చితకబాదినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు నగలు ఎక్కడ పెట్టారో చెప్పాలంటూ చితకబాదుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.