నిట్ చరిత్రలోనే తొలిసారి: ఇద్దరు విద్యార్ధులకు రూ. 67 లక్షల వేతనం
న్యూఢిల్లీ: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతోన్న ఇద్దరు భారతీయ విద్యార్ధులకు అమెరికా కంపెనీలు ఏడాదికి లక్ష డాలర్ల వేతనం చెల్లించేందుకు అంగీకరించాయి. ప్రస్తుతం జంషెడ్పూర్లోని నిట్లో జరుగుతోన్న ప్లేస్ మెంట్స్లో ఇద్దరు విద్యార్ధులు ఈ ప్యాకేజీని పొందారు.
నిట్ ప్లేస్మెంట్ ఆఫీసర్, ఫ్రొపెసర్ ఇన్ ఛార్జి డాక్టర్ రాజీవ్ భూషణ్ మాట్లాడుతూ అమెరికాకి చెందిన ఎపిక్ సిస్టమ్స్ అనే కంపెనీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదవుతున్న కిష్జిత్ గుప్తా, ఆలీ జాహిర్ అనే విద్యార్ధులకు సంవత్సరానికి గాను రూ. 67 లక్షల వేతనాన్ని ఆఫర్ చేసినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు నిట్, జంషెడ్పూర్లో ఇదే అత్యధిక వేతనమని ఆయన పేర్కొన్నారు. ఇక ఎపిక్ సిస్టమ్స్ కార్పోరేషన్ అమెరికాలో హెల్త్ కేర్ డొమైన్ రంగంలో అగ్రగామిగా ఉంది. ఇక జపాన్కు చెందిన మరో కంపెనీ శుభమ్ సతీష్ బాల్దావా (కంప్యూటర్స్ సైన్స్ విభాగం), భఱత్ సింగ్ భండారి (ఎలక్ట్రానిక్స్ విభాగం)కు చెందిన విద్యార్ధులకు రూ. 32 లక్షల వేతనాన్ని ఆఫర్ చేసిందన్నారు.
గత ఏడాది జపాన్కు చెందిన వర్క్ అప్లికేషన్స్ అనే కంపెనీ అత్యధికంగా రూ. 25 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసిందన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్లేస్ మెంట్స్లో 600 మంది విద్యార్ధులు జాబ్ ఆఫర్లను పొందారని అన్నారు. ఈ ఏడాది ప్లేస్మెంట్స్ జూన్ 2015 వరకు జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.