మత కల్లోలాలు చెలరేగుతున్నాయంటూ వదంతులు.. ఇద్దరి అరెస్టు: పుకార్లు పుట్టిస్తే
లక్నో: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదుపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన అనంతరం వదంతులను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని నొయిడాలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై తీర్పు వెలువరించిన రెండు గంటల్లోనే.. వదంతులను వ్యాపింపజేయడానిక వారు ప్రయత్నించినట్లు ఉత్తర్ ప్రదేశ్ లోని గౌతమ బుద్ధ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వైభవ్ కృష్ణ తెలిపారు.
తీర్పు తరువాత అయోధ్య ఎలా ఉందంటే..? రామజన్మభూమి వాసుల మనోగతం.. ముస్లింలు కూడా.. !
నొయిడాలో మత కల్లోలాలను సృష్టించడానికి కుట్ర పన్నినట్లు ఓ వ్యక్తి 100 ద్వారా కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి, సమాచారాన్ని ఇచ్చాడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ పరిస్థితి అంతా సాధారణంగా కనిపించింది. అపరిచితుడు ఇచ్చిన సమాచారంపై కొంతమంది స్థానికులను కూడా ప్రశ్నించారు. మత కల్లోలాలకు కుట్ర పన్నినట్లు అతను చెప్పడం అబద్దమని తేలింది. దీనితో ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అదుపులోకి తీసుకున్నారు. మత కల్లోలాలపై ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలను ఇచ్చాడని, దీనితో అతణ్ని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
మరో ఘటనలో- మత ఘర్షణలు చెలరేగడానికి కారణం అయ్యేలా, అలాంటి చర్యలను ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేసిన కేసులో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. అతను ఓ రాజకీయ పార్టీకి చెందిన పదాధికారిగా గుర్తించారు. తోటి వర్గం వారిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆ రాజకీయ నాయకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని వివరాలను వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు. ఈ ఘటన కూడా నొయిడాలోనే చోటు చేసుకుంది. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు చేయడాన్ని ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. దీన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.