ఇద్దరు రాజస్థాన్ బీజేపీ నేతలు వీడియోకు చిక్కారు!
కోటా: రాజస్థాన్లో ఇద్దరు బీజేపీ నేతలు చిక్కుల్లో పడ్డారు. కోటా ప్రాంతానికి చెందిన ఇద్దరు బీజేపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను బెదిరించినట్లుగా వీడియో, ఆడియో ఒకటి ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. వీడియోలో.. లడ్పూరా బీజేపీ ఎమ్మెల్యే, మరో నేత భవానీ సింగ్ రాజావట్లు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను బుజ్జగించినట్లు లేదా బెదిరించినట్లు వీడియోలో, ఆడియోలో ఉంది.
బీజేపీకి ఓటు వేయకుంటే బాగుండదని రాజావట్ హెచ్చరించినట్లుగా వీడియోలో ఉందని తెలుస్తోంది. మరో వీడీయోలో రాజావట్ డ్యూటీలో ఉన్న డిప్యూటీ ఎస్పీని దూషించినట్లుగా ఉంది. కాగా, సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి హరిమోహన్ శర్మ మాట్లాడుతూ.. ఈ ఇద్దరు నేతల పైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కాగా, ఓ మేల్ నర్సు బదిలిపై చీఫ్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ను ఫోన్లో బెదిరించారనే ఆరోపణపై రాజస్థాన్ బిజెపి శాసనసభ్యుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అధికారికి, ఎమ్మేల్యేకు మధ్య జరిగిన ఆడియో క్లిప్ వాట్సప్లో దుమ్మురేపింది. వివిధ సెక్షన్ల కింద శాసనసభ్యుడు ప్రహ్లాద్ గుంజాల్పై పోలీసులు గురువారంనాడు కేసు నమోదు చేశారు.
తమ పార్టీ కార్యకర్త బావమరిది బదిలీపై ఉత్తర్వులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కోట శాసనసభ్యుడు ప్రహ్లాద్ గుంజాల్ సిఎంహెచ్ఓ డాక్టర్ ఆర్ఎన్ యాదవ్ను బెదిరించారు. బదిలిపై అధికారికి తాను ఫోన్ చేసిన మాట వాస్తవమేనని, అయితే తాను అధికారిని హెచ్చరించలేదని గుంజాల్ అన్నారు. తమ పార్టీ కార్యకర్త బావ మరిది బదిలీ గురించి తాను అధికారితో మాట్లాడానని, అయితే తాను అధికారిని బెదిరించలేదని ఆయన అన్నారు.
తాను నాలుగు సార్లు బదిలీ కోసం అడిగానని, అధికారి తగిన విధంగా ప్రతిస్పందించలేదని అన్నారు. ఆ తర్వాత యాదవ్ పోలీసు స్టేషన్కు వెళ్లి శానససభ్యుడిపై ఫిర్యాదు చేశారు. తాను ఫిర్యాదు కాపీని పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటామని, నిందితుడు శాసనసభ్యుడు కావడంతో నివేదికను సిబిఐకి, క్రిమినల్ బ్యూరోకి పంపిస్తామని పోలీసు సూపరింటిండెంట్ అమన్దీప్ సింగ్ కపూర్ అప్పుడు చెప్పారు.
పదే పదే ఫోన్ చేసినా తాను ప్రతిస్పందించలేదంటూ చేసిన ఆరోపణపై యాదవ్ మాట్లాడడానికి నిరాకరించారు. బదిలీ కోరుతున్న మేల్ నర్సుపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని, విచారణ జరుగుతున్న విషయాన్ని చెప్పినా వినకుండా బదిలీ చేయాల్సిందేనని గుంజాల్ పట్టుబడుతూ వచ్చారని ఆనయ అన్నారు. ఆడియో క్లిప్ తనపై జరిగిన కుట్ర అని గుంజాల్ అంటున్నారు.
ఆరోగ్యాధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శాసనసభ్యుడిని బిజెపి నాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని బిజెపి రాష్ట్ర శాఖ శుక్రవారంనాడు ధ్రువీకరించింది. తనను మానసిక హింసకు గురి చేసినందుకు నిరసనగా ఆరోగ్యాధికారి రాజీనామా చేశారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే ప్రహ్లాద్ గుంజాల్ విచారం వ్యక్తం చేశారు. ఉద్వేగంలో ఆరోగ్యాధికారిపై నోరు చేసుకున్నట్లు తెలుపుతూ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర శాఖకు ఓ లేఖ రాశారు.