రేపిస్టులకు 20ఏళ్ల జైలు: పట్టించిన ‘హీరో’ఫొటో
మైసూరు: ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ప్రముఖ కన్నడ సినీనటుడు దర్శన్ ఫోటో పట్టించింది. దీంతో దర్యాప్తు జరిపిన పోలీసులు ఇద్దరు నిందితులను కోర్టు ఎదుట హాజరుపర్చారు. విచారించిన న్యాయస్థానం ఇద్దరు నిందితులకు 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. 2013 నవంబరు 26న కొడగు జిల్లా కుశాలనగరలో సర్కస్ ప్రదర్శన ఏర్పాటైంది. అందులో పని చేసే ఇద్దరు అస్సా రాష్ట్రానికి చెందిన యువతులు తాము తమ గ్రామానికి వెళ్తామని నిర్వాహకుడికి తెలిపారు. అందుకు నిర్వాహకుడు ససేమిరా అనడంతో ఆరోజు రాత్రి ఇద్దరూ సర్కస్ నుంచి బయటపడ్డారు.
బస్టాండ్ వద్ద వారు బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఓ ఆటో వచ్చింది. అందులో బయలుదేరారు. పిరియాపట్టణ సమీపంలో నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లిన ఆటోలోని పుట్టస్వామి, శంకర్ అనే వ్యక్తులు యువతులపై అత్యాచారానికి యత్నించారు. అప్రమత్తమైన ఓ యువతి వారి నుంచి తప్పించుకుంది. దీంతో మరో యువతిపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేశారు.
ఆ తర్వాత బాధిత యువతి సర్కస్ నిర్వాహకుడికి జరిగిన ఘోరాన్ని తెలిపింది. నిర్వాహకుడి సాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాము ప్రయాణించిన ఆటో వెనుక భాగంలో దర్శన్ ఫొటో ఉన్నట్లు పోలీసులకు వివరించారు బాధిత యువతి.
ఆ సమాచారం ఆధారంగా పట్టణంలోని ఆటోలన్నింటినీ పరిశీలించారు. దర్శన్ చిత్రం ఉన్న ఆటో యజమానుల్ని ప్రశ్నించారు. చివరకు కామాంధులు పుట్టస్వామి, శంకర్ అని వెల్లడైంది. సోమవారం కేసు విచారణను పూర్తి చేసిన న్యాయమూర్తి తీర్పును మంగళవారానికి రిజర్వు చేశారు. మంగళవారం తీర్పును ప్రకటించిన న్యాయస్థానం.. ఇద్దరు నిందితులకు 20ఏళ్ల జైలు శిక్షతోపాటు తలో రూ. 30 వేల వంతున జరిమానా విధించారు.