మరో దారుణం: బులంద్షహర్లో ఇద్దరు సాధువుల హత్య
లక్నో: మహారాష్ట్రలోని పాల్ఘర్లో జరిగిన ఇద్దరు సాధువులతోపాటు ఓ డ్రైవర్ను దారుణంగా హత్య చేసిన ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్షహర్లో మరో దారుణం జరిగింది. మంగళవారం దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి ఇద్దరు సాధువులను దారుణంగా హత్య చేశాడు.
టంగ్స్(పటకారు) దొంగతనం చేశావంటూ దూషించడంతో మురళి అనే నిందితుడు ఇద్దరు సాధువులు జగదీష్ దాస్(55), షేర్ సింగ్(45)లను దేవాలయంలోనే హత్య చేశాడు. పగౌనా గ్రామంలోని ఓ ఆలయంలో ఆ ఇద్దరు సాధువులు నివాసం ఉంటుండగా ఈ దారుణం జరిగింది.
మద్యంమత్తులో ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, దేవుడి కోరిక ప్రకారమే తాను ఆ ఇద్దరు సాధువులను చంపేశానని నిందితుడు పోలీసులకు చెప్పడం గమనార్హం.
మంగళవారం ఉదయం హత్యకు గురైన ఇద్దరు సాధువుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో చేతిలో కత్తితో తిరుగుతున్న నిందితుడు మురళీని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Bodies of two priests found at a temple in Bulandshahr. Police investigation underway. Post-mortem reports awaited. pic.twitter.com/SsH7hMrrSv
— ANI UP (@ANINewsUP) April 28, 2020
నిందితుడు గంజాయి కూడా తీసుకున్నట్లు గుర్తించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని చెప్పిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు సాధువులను కత్తితో పొడిచిన నిందితుడు, ఆ తర్వాత కర్రలతో కొట్టి చంపాడని బులంద్షహర్ ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. సాధువులను హత్య చేసిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళన నిర్వహించారు గ్రామస్తులు.
గత 15ఏళ్లుగా జగదీష్, ఐదేళ్లుగా షేర్ సింగ్ దాస్లు ఈ ఆలయంలోనే ఉంటున్నారు. కాగా, సాధువుల ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనపై దర్యాప్తు చేసి సమగ్ర నివేదికను అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్ఎస్పీలను ఆదేశించారు.