అవనిగడ్డలో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్: సెల్ సిగ్నల్తో గాలింపు
ఆగంతకులు ఫోన్ చేసే వరకు తమ పిల్లలు కిడ్నాప్నకు గురైన విషయం తల్లిదండ్రులకు తెలియలేదు. ఆ విషయం తెలియగానే ఆందోళన చెందిన పిల్లల తల్లిదండ్రులు అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కిడ్నాప్ చేసినవారి నుంచి పిల్లల తల్లిదండ్రులకు బుధవారం సాయంత్రం 3 గంటలకు ఒకసారి, 4 గంటలకు మరోసారి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఫోన్ కాల్ సిగ్నల్స్ను బట్టి కిడ్నాప్ చేసినవారు కృష్ణలంక ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో పోలీసులు గాలింపు చేపట్టారు.
అవనిగడ్డ నుంచి వచ్చిన పోలీసులతో పాటు విజయవాడ పోలీసులు గాలింపులో పాల్గొన్నారు. డబ్బులు ఇస్తే పిల్లలను వదిలిపెడతామని కిడ్నాపర్లు చెప్పినట్లు సమాచారం. దీంతో డబ్బుల కోసమే పిల్లలను కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే, వేకనూరు ఫాక్షన్ కక్షలకు పేరు మోసింది. దీంతో ఆ కోణంలో కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
పిల్లలిద్దరు అవనిగడ్డలోని పాఠశాలకు కూడా రాలేదని తెలుస్తోంది. తల్లిదండ్రులు సాయంత్రం 3 గంటలకు వచ్చి వాకబు చేస్తే వారు పాఠశాలకు రాలేదని తెలిసింది. దీంతో తీవ్ర కలవరానికి గురయ్యారు. కిడ్నాపర్లు వాడిన సెల్ నారాయణరావు అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు గుర్తించారు.