ఆకాశంలో అగ్నిగోళాలుః ఎదురెదురుగా గాల్లోనే ఢీ కొన్న యుద్ధ విమానాలు
బెంగళూరుః బెంగళూరులో ఏర్పాటైన ఏరో ఇండియా 2019 ఎయిర్ షో రిహార్సల్స్లో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు యుద్ధ విమానాలు పరస్పరం ఎదురెదురుగా గాల్లోనే ఢీ కొట్టుకున్నాయి. మంటల్లో చిక్కుకుపోయాయి. అగ్నిగోళాల్లా మారిపోయాయి. నిప్పులు చిమ్ముతూ నేల రాలిపోయాయి. చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒక కో పైలెట్ దుర్మరణం పాలయ్యారు.
మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం బెంగళూరు నగర శివార్లలోని యలహంక ఎయిర్ బేస్ టెర్మినల్ వద్ద ఈ ప్రమాదం చో్టు చేసుకుంది. బుధవారం నుంచి ఈ ఎయిర్ బేస్ టెర్మినల్ లో ఏరో ఇండియా 2019 ప్రదర్శన ఆరంభం కానుంది. దీనికోసం కొద్దిరోజులుగా వైమానిక దళ అధికారులు రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు.
రిహార్సల్స్లో భాగంగా వివిధ రకాల యుద్ధ విమానాలు, తేలికపాటి హెలికాప్టర్లతో విన్యాసాలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా ఈ రిహార్సల్స్ ఆరంభం అయ్యాయి. సూర్యకిరణ్ ఏరోబాటిక్స్ బృందానికి చెందిన రెండు తేలికపాటి హెలికాప్టర్లు ప్రదర్శన ఇస్తున్న సమయంలో పొరపాటు చోటు చేసుకుంది.
రెండు హెలికాప్టర్లు అతి సమీపానికి చేరుకున్న ఘటనను పూర్తి చేయబోతుండగా, ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో రెండు హెలికాప్టర్లు సుమారు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారం. గరిష్ఠంగా సూర్యకిరణ్ విమానాలు గంటకు 650 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. పరస్పరం గాల్లోనే ఢీ కొట్టుకున్నాయి. దీనితో ఓ హెలికాప్టర్ లో ఉన్న పైలెట్, కో పైలెట్ ప్రమాదాన్ని పసిగట్టి కిందికి దూకేశారు.
మరో హెలికాప్టర్ లో ఉన్న కో పైలెట్ మృత్యువాత పడ్డారు. ఢీ కొట్టిన వెంటనే హెలికాప్టర్లు ముక్కలు ముక్కలు అయ్యాయి. కొన్ని శకలాలు బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి సమీపానికి ఎగిరి పడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే యలహంకతో మరికొన్ని ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. సహాయక చర్యలు చేపట్టారు.