జమ్మూలో పాక్ గూడఛారుల అరెస్ట్?
భారత్ - పాక్ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను సైన్యం అదుపులోకి తీసుకుంది. అరెస్టైన ఇద్దరూ పాకిస్థాన్ గూఢచారులై ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న జవాన్లు ఇద్దరు వ్యక్తులు ఆర్మీ క్యాంప్, దాని పరిసర ప్రాంతాల ఫొటోలు, వీడియో తీస్తున్నట్లు గుర్తించారు.
వెంటనే అప్రమత్తమై జవాన్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని అదుపుకి తీసుకుని ప్రశ్నించారు.ఫొటోలు, వీడియో తీసిన వ్యక్తుల్లో ఒకరు కథువా, మరొకరు దొడా ప్రాంతానికి చెందిన వారని పోలీసుల విచారణలో తేలింది. ఆర్మీ క్యాంపు ఫొటోలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించగా సరైన జవాబు రాలేదు. దీంతో పోలీసులు వారిద్దరి సెల్ఫోన్లు తీసుకుని పరీక్షించారు.
నిందితులిద్దరూ పాకిస్థాన్కు చెందిన వ్యక్తులతో టచ్లో ఉన్నట్లు గుర్తించారు. అరెస్టుకు కొన్ని గంటల ముందు భారత్లో పలు ప్రాంతాలకు చెందిన వీడియోలను పాక్లో కొందరికి పంపినట్లు తేలింది. అరెస్టైన ఇద్దరూ పాక్ గూఢచారులా కాదా అనే విషయం తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.