ఫ్లై ఓవర్పై ప్రమాదం: గాలిలో ఎగిరి కింద పడి ఆంధ్ర టెక్కీ మృతి
బెంగళూరు: బెంగళూరు ఎలక్ట్రానికి సిటీ ఫ్లై ఓవర్పై శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో బహుళ జాతి సంస్థ (ఎంఎన్సి)ల్లో పనిచేస్తున్న ఇద్దరు టెక్కీలు మరణించారు. తాను నడుపుతున్న బైక్ రిటైనింగ్ వాల్ను ఢీకొట్టి కింద పడడంతో ఓ టెక్కీ మరణించాడు.
మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ బైక్ నడిపినందు వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో గుంటూరుకు చెందిన శరత్ కుమార్ రెడ్డి (28) అనే సాఫ్ట్వేర్ ఇంజనీరు మరణించాడు.
వేగంగా టర్న్ తీసుకున్నాడు...
ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న శరత్ కుమార్ రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. టూ వీలర్పై ఎలక్ట్రానికి సిటీ నుంచి మడివాల వెళ్తూ ఫ్లై ఓవర్పై లే బేలో చాలా వేగంగా ఎడమ వైపు తిరిగాడు. దాంతో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. శరత్ గాలిలో ఎగిరి కిందపడి పోయాడు.
మరో ప్రమాదంలో ఐబిఎం టెక్కీ
మరో ప్రమాదంలో హోండా సిటీ కారు ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లై ఓవర్ రిటైనింగ్ వాల్ను ఢీకొట్టిన ప్రమాదంల 38 ఏళ్ల టెక్కీ మరణించాడు. మృతుడిని రాజేష్ జాకోబ్గా గుర్తించారు. కారును ఈసి-2 లేన్ వైపు తిప్పిన సమయంలో అదుపు తప్పి ప్రమాదం జరిగింది.
ఈ స్థితిలో ప్రమాదం
ఐబిఎంలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీరు రాజేష్ వేరే ఎంఎన్సిలో పనిచేస్తున్న తన భార్యను తీసుకుని వెళ్లడానికి ఎలక్ట్రానిక్ సిటీ నుంచి బెల్లందూరు వైపు కారును తోలుతున్న సమయంలో ప్రమాదం జరిగింది.
వేగాన్ని తగ్గించకుండా మలుపు
కారు వేగాన్ని తగ్గించకుండా రాజేష్ మలుపు తిప్పాడు. దీంతో కారు రిటైనింగ్ వాల్ను ఢీకొట్టింది. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. ప్రమాదం జరిగిన సమయంలో అతను ఫోన్ మాట్లాడుతూ కారును నడుపుతున్నాడు.