Must Read:తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో క్వారంటైన్ తప్పనిసరి...!
కరోనావైరస్ కారణంగా దేశంలో అమలు చేసిన లాక్డౌన్ సందర్భంగా కేంద్రం కొన్ని సడలింపులను ఇచ్చింది. ఇందులో భాగంగా విమాన సర్వీసులను నడిపేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే దేశీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర విమానాయాన శాఖ ఇందుకోసం పలు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం తమ మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్నాయి. అంటే ఇతర రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి విమానాల ద్వారా చేరుకునే ప్రయాణికులు తమ రాష్ట్ర ప్రభత్వాల నిబంధనలను పాటించాల్సిందేనంటూ చెప్పుకొస్తున్నాయి. రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
సోమవారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అయితే ఇతర రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి వస్తున్న ప్రయాణికులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో కానీ లేదా హోం క్వారంటైన్లో కానీ తప్పనిసరిగా ఉండాలని కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, అస్సాం, జమ్మూకశ్మీర్ ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి విమానాల ద్వారా కేరళకు చేరుకునేవారు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మే 8కి కేవలం 16 పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్న కేరళ రాష్ట్రంలో గత రెండు వారాలుగా ఈ కేసులు పెరిగి 200కు చేరుకున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులతోనే ఈ కేసుల సంఖ్య మరింత పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. విమానాలే కాకుండా ఇతర రవాణా వ్యవస్థల ద్వారా కేరళకు చేరుకుంటున్న వారు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని కేరళ సీఎం పినరాయి విజయన్ స్పష్టం చేశారు. అయితే ఒకటి రెండ్రోజుల బిజినెస్ పనిపై వచ్చేవారికి ఇది వర్తించదని చెప్పారు.
ఇదిలా ఉంటే మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ల నుంచి విమానాల్లో కర్నాటకకు చేరుకునేవారు ప్రభుత్వం సూచించిన క్వారంటైన్ సెంటర్లలో వారం రోజుల పాటు ఆతర్వాత మరో 7 రోజుల పాటు హోంక్వారంటైన్లో ఉండాలని సూచించింది. ఇక ఈ రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు హోంక్వారంటైన్లో ఉండాలని యడియూరప్ప సర్కార్ పేర్కొంది. ఇక ఏపీ తెలంగాణ సర్కార్లు కూడా విమానాల ద్వారా ఇతర వాహనాల ద్వారా తమ రాష్ట్రాలకు వచ్చేవారు క్వారంటైన్ తప్పనిసరి చేశాయి. ఇక అస్సాం ప్రభుత్వం కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేసింది. తప్పనిసరిగా 14 రోజుల పాటు హోంక్వారంటైన్లో ఉండాల్సిందే అని వెల్లడించింది.
Recommended Video
ఇక ముంబై విమానాశ్రయంకు చేరుకునే ప్రతి ఒక్క ప్రయాణికుడిని క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేస్తామని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఆ తర్వాత వారందరినీ 14 రోజులపాటు హోంక్వారంటైన్లో ఉంచుతామని స్పష్టం చేసింది. అయితే మార్గదర్శకాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వస్తాయని పేర్కొంది.