కశ్మీర్ విధానంను వ్యతిరేకించిన బ్రిటన్ ఎంపీ డెబ్బీ అబ్రహామ్స్కు ఢిల్లీలో చేదు అనుభవం
న్యూఢిల్లీ: కశ్మీర్లో పర్యటన చేయనున్న పార్లమెంటరీ గ్రూప్కు నాయకత్వం వహిస్తున్న బ్రిటన్ ఎంపీ డెబ్బీ అబ్రహాంకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్న డెబ్బీ అబ్రహామ్స్ను అధికారులు అడ్డుకున్నారు. ఇండియన్ వీజా తిరస్కరణకు గురవడంతో కస్టమ్స్ అధికారులు ఆమెను అడ్డుకున్నట్లు ఆమె సన్నిహితుడు హర్ప్రీత్ ఉపాల్ చెప్పారు.
ఎమిరేట్స్ విమానంలో డెబ్బీ అబ్రహామ్స్ మరియు ఉపాల్లు దుబాయ్ నుంచి ఉదయం 9 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అయితే డెబ్బీ అబ్రహామ్స్ను ఎందుకు నిలువరిస్తున్నారో అనేదానిపై మాత్రం అధికారులు ఎలాంటి కారణాలు చెప్పలేదని ఉపాల్ ఆరోపించారు. అక్టోబర్ 2020 వరకు వీసా వ్యాలిడిటీ ఉందని మరి దాన్ని ఎందుకు రద్దు చేశారో అర్థం కావడం లేదని చెప్పారు. అయితే దీనిపై భారత విదేశాంగ శాఖ ఇంకా స్పందించాల్సి ఉంది . 2011 నుంచి అబ్రహామ్స్ రెండు సార్లు ఎంపీగా గెలిచారు. తన వ్యక్తిగత పర్యటనపై రెండ్రోజులు ఉండేలా భారత్కు వచ్చారు.
ఇక వీసా ఎందుకు రద్దు అయ్యిందో అధికారులకు వివరించే ప్రయత్నం చేశానని అదే సమయంలో వీసా ఆన్ అరైవల్ ఉంటే ఇవ్వండని కూడా తాను విజ్ఞప్తి చేసినట్లు డెబ్బీ అబ్రహామ్స్ చెప్పారు. తనకు ఘోర అవమానం జరిగిందని అయితే ఇందుకు బాధ్యులు ఎవరో స్పందించాలని కోరారు డెబ్బీ అబ్రహామ్స్. తనను యూకేకు పంపించే ఏర్పాట్లు చేయాలని... తనను భారత్లో క్రిమినల్లా చూశారనే భావనతోనే వెళతానని చెప్పారు. అంతకంటే ముందు తన కుటుంబ సభ్యులు మిత్రులను కలిసే అవకాశం భారత ప్రభుత్వం కల్పిస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
Recommended Video
గతేడాది ఆగష్టులో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దుచేయడంపై తీవ్ర విమర్శలు చేసిన వారిలో అబ్రహామ్స్ ఒకరు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల యొక్క నమ్మకానికి తూట్లు పొడిచిందంటూ ఆమె యూకేలో భారత హైకమిషనర్కు లేఖ రాశారు. మరోవైపు గతవారం భారత ప్రభుత్వం 20 మంది విదేశా దౌత్యాధికారులను కశ్మీర్ పర్యటనకు తీసుకెళ్లింది. గత ఆరు నెలల్లో ఇది రెండో పర్యటన కావడం విశేషం.