మరో గందరగోళం : రూ.500 నోటులో చాలానే తప్పులు!
కొత్తగా ప్రవేశపెట్టిన రూ.500నోటులో పొరపాట్లు దొర్లాయని ఆర్బీఐ ప్రతినిధి ఒకరు స్వయంగా వెల్లడించారు. ఆగమేఘాల మీద నోట్ల ముద్రణ జరగడంతో నోట్ల ప్రింటింగ్ లో సమస్యలు తలెత్తినట్టు ఆయన వెల్లడించారు.
బెంగుళూరు : నోట్ల రద్దు కష్టాలకు రోజుకో సమస్య అదనంగా తోడవుతూనే ఉంది. నిన్నటిదాకా 2వేల నోటుకు చిల్లర దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న జనాలు.. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన రూ.500నోటును చూసి కంగు తింటున్నారు. నోట్ల ముద్రణలో చోటు చేసుకున్న తప్పిదాలతో.. సామాన్యుల్లో మరోసారి గందరగోళం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కొత్తగా ప్రవేశపెట్టిన రూ.500నోటులో పొరపాట్లు దొర్లాయని ఆర్బీఐ ప్రతినిధి ఒకరు స్వయంగా వెల్లడించారు. ఆగమేఘాల మీద నోట్ల ముద్రణ జరగడంతో నోట్ల ప్రింటింగ్ లో సమస్యలు తలెత్తినట్టు ఆయన వెల్లడించారు. ప్రింటింగ్ లో తలెత్తిన ఈ సమస్యలతో కొత్తగా వచ్చిన రూ.500నోట్లు ఒకదానితో మరొకటి పోలిక లేకుండా ఉన్నాయి.
నోటులో గాంధీ బొమ్మ వెనకాల నీడలు కనిపించడం, జాతీయ చిహ్నాంలో స్వల్ప తేడాలు, అలాగే సీరియల్ నంబర్ అలైన్ మెంట్ లోను తేడాలు బయటపడడంతో.. ఇప్పుడు కొత్త రూ.500నోట్లపై సామాన్యుల్లో గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. అయితే ఆర్బీఐ అధికారులు మాత్రం టెన్షన్ అవసరం లేదని చెబుతున్నారు. తేడాలున్న నోట్లను కూడా మామూలు రూ.500నోటు లాగే వినియోగించుకోవచ్చునని, ఒకవేళ మార్పిడి చేసుకోవాలంటే ఆర్బీఐ కేంద్రాల్లో ఆ వెసులబాటు ఉంటాయని తెలిపారు.