రాఫెల్ వివాదం: అనిల్ అంబానీ ఎవరిని కలిశారు.. ఎందుకు కలిశారు?
ఢిల్లీ: మొన్నటికి మొన్న ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక రాఫెల్ యుద్ధవిమానకొనుగోలుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టడంతో విపక్షాలు మోడీ సర్కారుపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అంశం రాఫెల్కు సంబంధించి బయటకు పొక్కింది. 2015 మార్చి చివరివారంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఫ్రాన్స్ రక్షణశాఖ మంత్రి జీన్-వెస్ లి డ్రైన్ కార్యాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ అనిల్ అంబానీ ముఖ్య సలహాదారులతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏం చర్చించారు.. అనిల్ అంబానీ ముందుగానే ఫ్రాన్స్ రక్షణశాఖ అధికారులను ఎందుకు కలిశారు..?
అనిల్ అంబానీ ముందే ఎవరెవరిని కలిశారు..?
రాఫెల్ వివాదం మరో మలుపు తీసుకుంది. ప్రతిరోజు దీనిపై ఏదో ఒక అంశం బయటపడుతూనే ఉంది. తాజాగా అనిల్ అంబానీ ఫ్రాన్స్ రక్షణశాఖ అధికారులను ప్రధాని మోడీ పర్యటనకంటే ముందే కలిసిన విషయం బయటకు పొక్కింది. ఈ సమావేశానికి ఫ్రాన్స్ రక్షణశాఖ మంత్రి ప్రత్యేక సలహాదారుడు జీన్ క్లాడ్ మల్లెట్, పారిశ్రామిక సలహాదారుడు క్రిస్టోఫె సాలోమన్, టెక్నికల్ సలహాదారుడు జెఫ్రీ బాయ్కాట్ కూడా అంబానీతో సమావేశమైయ్యారు. ఈ సమావేశం జరిగిన 15 రోజులకు ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఢిఫెన్స్ హెలికాఫ్టర్లపై ఆసక్తి కనబర్చిన అనిల్ అంబానీ
అంబానీతో సమావేశంలో చర్చించిన విషయాలను బయటకు పెట్టేందుకు నిరాకరించారు సాలోమన్. అది చాలా ముఖ్యమైన సమావేశమని.. బహిర్గతం చేయలేమని వెల్లడించారు. ఈ సమావేశం సందర్భంగా ఎయిర్ బస్ హెలికాఫ్టర్లు, డిఫెన్స్ హెలికాఫ్టర్లకు సంబంధించి ఫ్రాన్స్తో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు అంబానీ ఆసక్తికనబర్చినట్లు ఆ సమావేశంలో పాల్గొన్న ఓ అధికారి వెల్లడించారు. అంతేకాదు ఇందుకోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందామని కూడా అనిల్ అంబానీ అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటనకు వచ్చినప్పుడే జరిగేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆ అధికారి వెల్లడించారు.
స్కెచ్లో భాగంగానే మోడీ టీమ్లో అనిల్ అంబానీ
ఇక అనిల్ అంబానీ ఫ్రాన్స్ రక్షణకార్యాలయంలో సమావేశానికి హాజరు అయిన నాటికంటే ముందే ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన 2015 ఏప్రిల్ 9 నుంచి 11వ తేదీవరకు ఉంటుందన్న విషయం తెలుసునని ఆ అధికారి వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రధానితో పాటు ఫ్రాన్స్కు వెళ్లిన బృందంలో అనిల్ అంబానీ కూడా ఉన్నారు. ఆ సమయంలోనే నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలాండే ప్రధాని నరేంద్ర మోడీల సంయుక్త సమావేశంలో రాఫెల్ ఒప్పందం జరిగింది. అంతకు ముందే అంటే మార్చి 28న రిలయన్స్ డిఫెన్స్ ఈ ఒప్పందంలో భాగస్వామి అయినట్లు తెలుస్తోంది.
జైశంకర్ ప్రెస్మీట్లో హాల్ ప్రస్తావన
ఇక ఏప్రిల్ 8, 2015లో విదేశీ కార్యదర్శి జైశంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో రాఫెల్ ఒప్పందం గురించి మాట్లాడిన జైశంకర్... ఫ్రెంచ్ సంస్థ, రక్షణశాఖ, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్లు చర్చలు జరుపుతున్నాయని ఆయన చెప్పారు. ఈ చర్చలు నిరంతరం కొనసాగుతాయని చెప్పిన జయశంకర్ ఇందులో సాంకేతిక అంశాలతో పాటు అన్ని వివరాలపై చర్చలు జరుపుతామని చెప్పారు. అంతేకాదు రక్షణశాఖకు సంబంధిచిన ఒప్పందాలను ఇరు దేశాల నాయకుల సమావేశాలతో కలిపి చూడటం లేదని వెల్లడించారు.