ఇంట్రెస్టింగ్ : భర్త అంత్యక్రియలపై ఇద్దరు భార్యల గొడవ..హైకోర్టును ఆశ్రయించిన వైనం
చెన్నై: మృతి చెందిన భర్తను ఖననం చేయాలా లేదా దహనం చేయాలా అన్నదానిపై గొడవపడ్డ ఇద్దరు భార్యలు కోర్టును ఆశ్రయించిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ వింత కేసును చూసి జడ్జీనే విస్తుపోయారు. ఇక వివరాల్లోకి వెళితే.. దక్షిణామూర్తి అనే ఆయన ముందుగా తంగమ్మళ్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె ద్వారా ఆయనకు ఇద్దరు కొడుకులు కలిగారు. కొన్నేళ్లు తంగమ్మాళ్తో కాపురం చేశాకా ఆమెకు విడాకులు ఇవ్వకుండానే యేసుమేరీ అలియాస్ గౌరీని పెళ్లి చేసుకున్నాడు. ఈమె ద్వారా ఆయనకు ఒక కుమార్తె కలిగింది. ఇక కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో దక్షిణామూర్తి మరణించాడు. అయితే ఆయన ఇద్దరు భార్యలు గొడవ పడింది ఆస్తుల కోసం కాదు... ఆయన అంత్యక్రియలు నిర్వహించేది తామంటే తామే అనే దానిపై గొడవపడ్డారు. చివరకు అది హైకోర్టు వరకు వెళ్లడంతో ఈ ఘటన వార్తల్లో నిలిచింది.
దక్షిణామూర్తి అంత్యక్రియలు హిందూ సాంప్రదాయం ప్రకారమే తాము నిర్వహిస్తామని ఆయన మృతదేహాన్ని దహనం చేస్తామని అంత్యక్రియలకు అడ్డంకులు కలగకుండా జరిగేందుకు రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు తంగమ్మాళ్ ఆమె కొడుకు. అదే సమయంలో దక్షిణామూర్తి అంత్యక్రియలు క్రైస్తవ పద్ధతిలోనే జరగాలని ఆయన మృతదేహాన్ని ఖననం చేసేందుకు అనుమతించాలని జడ్జీని కోరింది యేసుమేరీ. ఈ కేసును విచారించిన జడ్జీకి మరో విషయం తెలిసింది. తన మరణాంతరం తన అంత్యక్రియలు క్రైస్తవ పద్ధతిలోనే జరగాలంటూ దక్షిణామూర్తి తాను మరణించిన రోజున అంటే ఆగష్టు 16 వీలునామా రాసి దానిపై తన సంతకం కాకుండా వేలిముద్ర వేసినట్లు బయట పడింది. ఇక ఇక్కడే స్టోరీ కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది.
అది దొంగవేలిముద్రలని తంగమ్మాళ్ ఆరోపించింది. తన భర్త చివరి గడియల్లో ఉన్నసమయంలో ఆవేలి ముద్రలు బలవంతంగా వేయించి ఉంటారని ఆమె ఆరోపించింది. ఇద్దరి మధ్య గొడవ పెద్దదిగా మారడంతో పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆ తర్వాత హైకోర్టుకు చేరింది. ఇద్దరి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దక్షిణామూర్తి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఇక కేసును విచారణ చేసిన జడ్జి జస్టిస్ ప్రకాష్.. ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కలగాలని... ఇద్దరు చర్చించుకుని తిరిగి కోర్టుకు రావాలని రెండురోజుల సమయం ఇచ్చారు. ఒకవేళ ఇద్దరి మధ్య రెండురోజుల్లో ఏకాభిప్రాయం కుదరకపోతే చట్టపరంగా న్యాయపరంగా దక్షిణామూర్తి అంత్యక్రియలు పూర్తి చేయాలని ఆదేశించారు. అంతేకాదు కొందరికి మరణం తర్వాత కూడా సంతోషం ఉండదని జస్టిస్ ప్రకాష్ వ్యాఖ్యానించారు. అందుకు ఉదాహరణ దక్షిణామూర్తేనని చెప్పుకొచ్చారు.